వరల్డ్ క్రికెట్‌లో టాప్ 8 జట్లు తలపడబోయే ICC ట్రోఫీ ప్రారంభం

- May 31, 2017 , by Maagulf
వరల్డ్ క్రికెట్‌లో టాప్ 8 జట్లు తలపడబోయే ICC ట్రోఫీ ప్రారంభం

గత రెండు నెలలుగా ఐపీఎల్ మజాను ఆస్వాగించిన క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మెగా టోర్నీ వచ్చేసింది. వరల్డ్ క్రికెట్‌లో టాప్ 8 జట్లు తలపడబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి రేపటి నుంచే తెరలేవబోతోంది.  డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, హోస్ట్ కంట్రీ ఇంగ్లాండ్ టైటిల్ రేసులో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌తో తలపడబోతోంది.

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా సిధ్ధమైంది. ప్రపంచ క్రికెట్‌లో ఎనిమిది అత్యుత్తమ జట్ల మధ్య జరిగే ఈ వన్డే క్రికెట్ సమరానికి ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోంది. జూన్ 1 నుంచి 18 వరకూ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి.. లీగ్‌ కమ్ నాకౌట్‌ పధ్ధతిలో టోర్నీ నిర్వహించనున్నారు. అభిమానుల్ని అలరించేందుకు ప్రపంచకప్ ఒక్కటే సరిపోదని భావించిన ఐసిసి 1998లో ఈ టోర్నీని మొదలుపెట్టింది. 2002 నుంచీ ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోఫీ మారిన ఈ మినీ వరల్డ్‌కప్‌ను ముందు రెండేళ్ళకొకసారి నిర్వహించేవారు. అయితే 2006 తర్వాత పలు కారణాలతో క్రమం తప్పింది. 2009 నుంచి ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 8 జట్లు దీనిలో తలపడుతున్నాయి. చివరిసారిగా 2013లో ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచింది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ధోనీసేన 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.

మినీ ప్రపంచకప్‌గా భావించే ఈ టోర్నీలో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేం. అయితే ఈ టోర్నీలో టీమిండియాకు మంచి రికార్డే ఉంది. రెండుసార్లు టైటిల్ గెలుచుకున్న భారత్‌...2000 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇక 2004, 2006, 2009 ఎడిషన్లలో లీగ్‌స్టేజ్‌కే పరిమితమైంది. ప్రస్తుతం పలువురు టాప్ ప్లేయర్స్‌తో ఉన్న టీమిండియాకు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ కోహ్లీసేన పూర్తి ఆధిపత్యం కనబరిచింది. గత ఎడిషన్‌లో భారత్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్లు ధావన్‌,రోహిత్‌శర్మలపై అంచనాలున్నాయి. వీరితో పాటు ఇంగ్లాండ్ పిచ్‌లపై మంచి రికార్డున్న కోహ్లీ, యువరాజ్‌ కూడా కీలకం కానున్నారు. బౌలింగ్‌లో మన పేస్ విభాగం పటిష్టింగా కనిపిస్తోంది. వార్మప్ మ్యాచ్‌లలో భవనేశ్వర్‌, షమీ, బూమ్రా త్రయం అదరగొట్టింది. దీంతో పేస్‌కు అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్‌లపై వీరు చెలరేగడం ఖాయమని చెప్పొచ్చు. ఇక రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆస్ట్రేలియా కూడా టైటిల్ రేసులో ఉంది. అలాగే గత ఎడిషన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఇంగ్లాండ్ , దక్షిణాఫ్రికా జట్లు కూడా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగుతుండడంతో పలు సంచలనాలు నమోదయ్యే అవకాశాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com