దాసరి నారాయణరావు కోడలు సంచలన వ్యాఖ్యలు

- June 01, 2017 , by Maagulf
దాసరి నారాయణరావు కోడలు సంచలన వ్యాఖ్యలు

దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిపై తనకు అనుమానాలున్నాయంటూ ఆయన పెద్ద కోడలు సుశీల సంచలన వ్యాఖ్యలు చేశారు.  దాసరి కన్నుమూసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.  గతంలో దాసరి ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను చూడటానికి వెళ్లానని, అప్పుడు తనను అనుమతించలేదని, తనను అనుమతించకపోవడంపైనా అనుమానాలున్నాయని ఆమె చెప్పారు. తన కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నా తన భర్త నుంచి తాను ఇంకా విడాకులు తీసుకోలేదని తెలిపారు. తన మామగారు గతంలో ఆసుపత్రిలో ఉన్నప్పుడే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని అన్నారు. అంత ఆరోగ్యమైన మనిషి ఇంత హఠాత్తుగా ఎలా అనారోగ్యం పాలయ్యారని అనుమానం వ్యక్తం చేశారు.

ఈ నెల 4న తాను మామగారి దగ్గరకు వెళ్లానని, ఆయన తనతో మంచిగా మాట్లాడారని చెప్పారు. తన కొడుకును సినీ రంగానికి పరిచయం చేస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ‘ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది. రెండు వారాలు ఆగి రండి. కూర్చుని మాట్లాడుకుందాం’ అని దాసరి తనకు చెప్పారని అన్నారు. తమకు దాసరి ఆస్తిలో భాగం ఏమీ ఇవ్వలేదని, తమకు తప్పకుండా న్యాయం చేస్తానని ఆయన అన్నారని వివరించారు. తన మనవడిని దగ్గరకు తీసుకుంటానని దాసరి అన్నారని, ఇంతలోనే ఆయన మరణించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని సుశీల చెప్పారు. ఆమె వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com