బంగారం, చెప్పులు, దుస్తుల పై ఖరారైన జీఎస్‌టీ టాక్స్ రేట్లు

- June 03, 2017 , by Maagulf
బంగారం, చెప్పులు, దుస్తుల పై ఖరారైన జీఎస్‌టీ టాక్స్ రేట్లు

జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ని అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కొన్ని వస్తువులపై రేట్లను ఖరారు చేసేందుకు శనివారం దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశమైంది. బంగారం, ఆభరణాలు , వజ్రాలు, వెండిపై 3శాతం పన్ను విధించాలని జీఎస్‌టీ మండలి నిర్ణయించింది. రెడీమేడ్‌ దుస్తులపై 12శాతం, నూలు, చేనేత వస్త్రాలపై 18శాతం, రూ.500లోపు ఉన్న పాదరక్షలపై 5శాతం, రూ.500 దాటిన పాదరక్షలపై 18శాతం చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు. సిల్కు, జనపనార ఉత్పత్తులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చారు. రూ.వెయ్యి లోపు వస్త్రాలపై 5శాతం, బీడీలపై 28 శాతం, బ్రాండెడ్‌ బిస్కెట్లపై 18శాతం, సౌర పలకలపై 5శాతం చొప్పున పన్ను విధించారు.

గత నెలలో జరిగిన సమావేశంలో 1200కు పైగా వస్తువులు, 500 వరకూ సేవలకు నాలుగు శ్లాబుల్లో 5, 12, 18, 28 శాతం చొప్పున రేట్లు నిర్ణయించిన కౌన్సిల్‌ ఈ రోజు జరిగిన సమావేశంలో పసిడి, బిస్కెట్లు, దుస్తులు, పాదరక్షలు తదితర అంశాలకు సంబంధించి రేట్లను ఖరారు చేసింది. ఈ సమావేశంలో ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌లు పాల్గొన్నారు.

కొన్ని శ్లాబులపై అభ్యంతరాలున్నాయి: ఈటల 
జీఎస్‌టీ శ్లాబులపై తమకు ఇంకా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలుచేయాలని అంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరుగుతున్నాయని, సాఫ్ట్‌వేర్‌ను ఎలా అప్‌డేట్‌ చేయడంపై దృష్టిపెట్టాలని, లేకపోతే గందరగోళం నెలకొంటుందన్నారు. అందువల్ల తమకు కొన్ని శ్లాబ్‌లపై ఉన్న అభ్యంతరాలను ఈ నెల 11న మళ్లీ దిల్లీలో జరిగే సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే.. స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. సినిమా రంగంపై ప్రస్తుతం ఎక్కువ ఉందని, దాన్ని 12శాతంగా నిర్ణయించాలని తాము ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com