జులై 17న భారత్ రాష్ట్రపతి ఎన్నిక

- June 07, 2017 , by Maagulf
జులై 17న భారత్ రాష్ట్రపతి ఎన్నిక

దిల్లీ: దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు చర్యలు చేపట్టినట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నసీమ్‌ జైదీ తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగుస్తుందని, ఆర్టికల్‌ 324 ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆయన మీడియాకు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికకు ఈనెల 14న నోటిఫికేషన్‌ జారీచేయనున్నట్టు స్పష్టంచేశారు. జులై 17న పోలింగ్‌, జులై 20న ఓట్ల లెక్కింపు ఉంటుందని జైదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసేందుకు జూన్‌ 28 ఆఖరి తేదీగా నిర్ణయించినట్టు చెప్పారు. జులై 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, జులై 20న ఉదయం 11గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్టు ఆయన వివరించారు. దిల్లీ, గోవా, పుదుచ్ఛేరి కేంద్ర పాలిత ప్రాంతాలు సహా అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్‌ జరుగుతుందన్నారు.
ఒక్కో అభ్యర్థి నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపాదించేందుకు 50 మంది సభ్యులు, బలపరిచేందుకు 50 మంది సభ్యులు ఉండాలన్నారు. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలోనే ఓటింగ్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. లోక్‌సభ కార్యదర్శిని రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా ఎన్నికల సంఘం నియమించిందన్నారు. రాజకీయ పార్టీలు తమ సభ్యులకు విప్‌ జారీచేయకూడదని ఈ సందర్భంగా జైదీ సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com