ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి ఇకలేరు
- June 11, 2017
హైదరాబాద్: సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణరెడ్డి ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1953లో ‘ నవ్వని పువ్వు’ సినారె తొలి రచన. 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్నారు. 1977లో పద్మశ్రీ పురస్కారం వరించింది. సినారె రాజ్యసభ సభ్యునిగానూ సేవలందించారు. తెలుగు చలన చిత్ర రంగంలో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
సి.నారాయణరెడ్డి 1931, జూలై 29న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేట్లో జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యారు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు. విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివారు.
సికింద్రాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారాలు పొందారు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.
ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ ఆయన పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శనా గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి ఎన్నో రాశారు. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవారు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించారు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.
రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించారు.
సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవిత రాశారు. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్లాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నారు.
పురస్కారాలు
* ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం
* కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
* భారతీయ భాషా పరిషత్
* రాజ్యలక్ష్మీ పురస్కారం
* సోవియట్-నెహ్రూ పురస్కారం
* ఆసాన్ పురస్కారం
* జ్ఞానపీఠ్ అవార్డు
పదవులు..
* ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు(1981)
* అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు(1985)* పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు(1989)*ఆంధ్రప్రదేశ్ సాంస్కృతి వ్యవహారాల సలహాదారు(1982)* రాష్ట్ర
సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్లు సేవలందించారు
రాజ్యసభ సభ్యునిగా..
సినారెను భారత రాష్ట్రపతి 1997లో రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారు. ఆరేళ్లపాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్నలనలను అందుకున్నాయి.
రాజ్యసభ సభ్యునిగా కరీంనగర్ జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









