భారత డిప్యూటీ హైకమిషనర్కు సమన్లు జారీచేసిన పాక్

- June 12, 2017 , by Maagulf
భారత డిప్యూటీ హైకమిషనర్కు సమన్లు జారీచేసిన పాక్

కశ్మీర్‌లో నిత్యం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ, చొరబాట్లకు పాల్పడుతున్న పాక్...అలాంటిదేమీ లేదని ఎప్పటికప్పుడు బుకాయిస్తూనే ఉంది. తాజాగా నియంత్రణ రేఖ వెంబడి భారత దళాలు జరుపుతున్న కాల్పుల్లో తమ దేశ పౌరులు ముగ్గురు మృతి చెందారని ఆరోపిస్తూ.. పాక్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్‌ను పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. డైరెక్టర్ జనరల్ (దక్షిణాసియా, సార్క్) మొహమ్మద్ ఫైసల్ భారత డిప్యూటీ హైకమిషనర్‌ జె.పి.సింగ్‌ను పిలిపించి భారత దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కాల్పులు జరపడాన్ని ఖండించినట్టు పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. ఈనెల 10, 12 తేదీల్లో చిరికోట్, హాట్ స్ప్రింగ్ సెక్టార్లలో జరిపిన కాల్పుల్లో ముగ్గురు పాక్ పౌరులు మరణించారు. 'పౌరులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇది అంతర్జాతీయ మానవ హక్కులు, మానవ చట్టాలను ఉల్లంఘించడమే' అని విదేశాంగ కార్యాలయం పేర్కొంది. 2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ గౌరవించాలని, కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన అన్ని ఘటనలపై దర్యాప్తు జరిపించాలని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథాతథంగా గౌరవించి, నియంత్రణ రేఖ వెంబడి శాంతి నెలకొనేలా భారత దళాలను ఆదేశించాలని డైరెక్టర్ జనరల్ ఫైసల్ కోరారు.

జన్‌డ్రాట్, హాట్‌స్ర్పింగ్ సెక్టార్లలో కాల్పుల విరమణ ఒప్పందానికి భారత దళాలు తూట్లు పొడిచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే భారీ ఆయుధాలు, మోర్టార్లతో విరుచుకుపడినట్టు పాక్ ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కాల్పుల్లో ముగ్గురు పాక్ పౌరులు మరణించారని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com