దుబాయ్ లో వీనులవిందుగా సాగిన MID వారి 'అన్నమాచార్య సంకీర్తనా వైభవం'

- June 12, 2017 , by Maagulf

దుబాయ్: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 'మ్యూజిక్ ఇండియా దుబాయ్' వారు ఎంతో ఘనంగా 'అన్నమాచార్య సంకీర్తనా వైభవం' ను దుబాయ్ లో నిర్వహించారు. 'న భూతో న భవిష్యతి' అన్న రీతిలో సాగింది ఈ కార్యక్రమం. సంగీతాభిమానులనే కాక ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా మ్యూజిక్ ఇండియా దుబాయ్ ఫౌండర్ ప్రశాంతి చోప్రా మరియు ఫౌండర్ మెంబెర్ రాకేష్ మరింగంటి అద్భుతంగా కీర్తనలను ఎంపిక చేసి మధుర స్వరంతో ఆలపించారు. చిన్నారులు తమ మధుర స్వరాలతో ఆలపించిన కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి అశేష గాయనీ గాయకులూ ఔత్సాహికంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 'అన్నమయ్య ప్రాజెక్ట్' ఫౌండర్ శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు తమ అమృత స్వరంతో ప్రతి కీర్తనను ఎంతో వివరంగా వివరించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

అనంతరం యూఏఈ లో గల పలు ఎమిరేట్స్ నుంచి ఎందరో సంగీతకారులు అనేక కీర్తనలు గానం చేసి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు మరియు వాద్య సహాయం అందించిన కళాకారులకు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు చేతులమీదుగా జ్ఞాపికలను అందించడం జరిగింది. ప్రేక్షకులకు లక్కీ డ్రా లు నిర్వహించి విజేతలకు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు బహుమతులు అందించారు. అనంతరం మ్యూజిక్ ఇండియా దుబాయ్ టీం, స్పాన్సర్స్ మరియు మాగల్ఫ్ టీం వారు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరయిన అశేష సంగీతాభిమానులకు మ్యూజిక్ ఇండియా దుబాయ్ ఫౌండర్ ప్రశాంతి చోప్రా మరియు ఫౌండర్ మెంబెర్ రాకేష్ మరింగంటి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి మజూన్ సంస్థ,ట్రావెల్ వింగ్స్ మరియు యస్.ఆర్ ఇంటెలిజెంట్ టెక్నాలజీస్  - స్పాన్సర్ గా, రుచీ రెస్టారంట్ - ఫుడ్ పార్టనర్ గా వ్యవహరించారు. మీడియా పార్టనర్ గా మాగల్ఫ్.కామ్ వ్యవహరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com