నైరుతి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు

- June 18, 2017 , by Maagulf
నైరుతి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రాగాలు వినిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సీజన్‌ ప్రారంభంలోనే వర్షాలు పడుతుండటంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతోంది. నిజామాబాద్‌, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వాగులు పొంగుతున్నాయి. తాళ్లగూడలో వరద ఉధృతి మరింత పెరుగుతోంది. అటు నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాయంత్రం మొదలైన వాన రాత్రి 8 గంటల వరకు నాన్‌స్టాప్‌గా కురుస్తూనే ఉంది.
హైదరాబాద్‌ను వర్షం ముంచెత్తింది. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్‌లోని ఓయూ క్యాంపస్‌, తార్నాక, హబ్సిగూడ, నాచారం, లాలాపేట్‌, మల్లాపూర్‌, కాచిగూడలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. నిన్న సాయంత్రం నుంచే చినుకులతో మొదలై అర్థరాత్రికి మరింత పెరిగింది. పలు చోట్ల వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. 
వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందంటున్నారు. అటు ఈ సీజన్‌లో అనుకున్న దానికంటే వర్షపాతం అధికంగానే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 76 శాతం ఎక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com