డబ్బుని రెట్టింపు చేసే భస్మంతో మోసం చేసే ఇరువురు విదేశీయులు అరెస్ట్

- July 15, 2017 , by Maagulf
డబ్బుని రెట్టింపు చేసే భస్మంతో మోసం చేసే ఇరువురు విదేశీయులు అరెస్ట్

మస్కట్ : " మాయా  లేదు...మంత్రం లేదు బాబు ..రండి బాబు రండి ....ఎన్నాళ్ళు అంతగా కష్టపడాలి ? ఈ విభూది మహిమ ఒక్కసారి  చూడండి...మీ వద్ద ఉన్న డబ్బు మీద మా అద్భుత పొడి వెదజల్లితే అది క్షణాలలో రెట్టింపు సొమ్ముగా  మారుతుంది.."  అని నమ్మబలికే గారడీ చేసే మాయగాళ్లు గల్ఫ్ దేశాలలోనూ తారసపడుతున్నారు.. అమాయక చక్రవర్తులను ఎంచుకొని ఆపై వారికి కుచ్చుటోపీపెట్టి వారి డబ్బుతో ఉడాయించే మాయగాళ్ళు ఎడారి దేశాలలోనూ ' బకరాల ' కోసం అన్వేషిస్తున్నారు. రాయల్ ఒమాన్ పోలీసులు ఇటీవల ఇరువురు ఘరానా  విదేశీయులను అరెస్ట్ చేశారు. ఒక అమాయక పౌరుడికి మాయమాటలు చెప్పి ఆ వ్యక్తి వద్ద నుంచి వారు సులువుగా  3,000 రియల్ ఒమాన్ డబ్బు కంటే ఎక్కువ మొత్తాన్ని అపహరించారు. అయితే, ఆ తరహా మోసానికి పాల్పడిన ఆ జంట దొంగలను వెంటాడి పోలీసులు తమ అదుపులోనికి తీసుకొన్నారు. బుషెర్  పోలీస్ స్టేషన్ నుండి ఓ అధికారి ఒకరు ఆ విదేశీయులు చేసే మోసాన్ని వివరిస్తూ,  ఆ విదేశీయులు తమ మాటల గారడితో ఒక పౌరుడికి వల వేశారని..ఆర్ధికంగా స్థితిమంతులు అయ్యేందుకు ఓ అద్భుతమైన పరిష్కారం తమ వద్ద ఉందని నమ్మబలికేరని ఆ అధికారి తెలిపారు. ఆ నిందితులు..తమ వద్ద ఉన్న పొడితో.. బాధితుడికి చెందిన  3,000 రియల్ ఒమాన్ డబ్బు కంటే ఎక్కువ సొమ్ముని రెట్టింపు చేస్తామని... బాధితుడిని బురిడీ కొట్టించిన ఆ ఇరువురు నిందితులు డబుల్ స్థాయిలో పెరిగిన డబ్బుని అందుకోవాలంటే, కొంత ఆలస్యం అవుతుందని...ఓపికతో కళ్ళు మూసికొని ఉండమని చెప్పి ఆ మోసగాళ్లు కాళ్లకు బుద్ధిచెప్పి అక్కడ నుంచి మాయమయ్యారని  ఆ తర్వాత తాము వారిని వెదికి అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి పేర్కొన్నారు.." ఈ తరహా మోసాలు చేసే వారిపట్ల  పౌరులు మరియు నివాసితులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మాంత్రిక పొడులతో మీ డబ్బును రెట్టింపు చేస్తామని వాగ్దానం చేస్తున్న నిందితుల బారిన పడకండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ చేష్టలకు పాల్పడే మోసగాళ్లు తారసపడితే,వెంటనే వారిని గూర్చిన సమాచారం తమకు తెలియజేయమని ఆయన ప్రజలను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com