ఆల్ప్స్‌ పర్వతాలపై 50ఏళ్లనాటి మానవ అవశేషాలు

- July 29, 2017 , by Maagulf
ఆల్ప్స్‌ పర్వతాలపై 50ఏళ్లనాటి మానవ అవశేషాలు

ఆల్ప్స్‌ పర్వతాలపై.. 
50ఏళ్లనాటి ప్రమాదంలో మానవ అవశేషాలు 
యాభై ఏళ్ల క్రితం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మానవ అవశేషాలను ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్‌ పర్వతాలపై గుర్తించారు. డేనియల్‌ రోచే అనే వ్యక్తి వీటిని గుర్తించి.. అధికారులకు సమాచారమిచ్చారు. ఈ అవశేషాలు 1966 లేదా 1950లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతులవి అయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
డేనియల్‌ రోచేకు స్వతహాగా విమాన ప్రమాద అవశేషాలను గుర్తించడమంటే ఆసక్తి ఎక్కువ. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలను తెలుసుకుని వాటి శిథిలాలను సేకరించారు. ఆ క్రమంలో ఆల్ప్స్‌ పర్వతాలపై మానవ అవశేషాలను గుర్తించారు. ‘గతంలో ఇలా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు మృతుల అవశేషాలను ఎన్నడూ నేను గుర్తించలేదు. ఈ సారి ఓ మనిషి చేయి, తొడ భాగాన్ని కనుగొన్నాను’ అని రోచే తెలిపారు. ఆ అవశేషాలు ఓ మహిళవి అయి ఉంటాయన్నారు.దీంతో పాటు ఎయిరిండియాకు చెందిన నాలుగు జెట్‌ ఇంజిన్లకు కూడా రోచే గుర్తించారు.
వీటి గురించి స్థానిక ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు సమాచారం ఇవ్వడంతో వారు అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అవశేషాల గురించి ఇప్పుడే ఎలాంటి వివరాలు చెప్పలేమన్నారు. ఫోరెన్సిక్‌ నిపుణులు పరీక్షించిన తర్వాతే పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు. 1966 జనవరిలో బాంబే నుంచి న్యూయార్క్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 707 విమానం.. మాంట్‌ బ్లాక్‌ సమీపంలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో 117 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు 1950లో మరో ఎయిరిండియా విమానం ఇదే పర్వత ప్రాంతంలో కూలింది. ఈ ఘటనలో 48 మంది మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com