వర్షం కారణంగా జాగారం చేస్తున్న బెంగళూరు
- September 04, 2017
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం తడిసి ముద్దవుతోంది. చినుకు పడితే చాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా జాగరం చేస్తున్నారు. ఆదివారం రాత్రి 11.45గంటలకు ప్రారంభమైన వర్షం సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ డైరెక్టర్ సుందర్ మైత్రి తెలిపారు. కృష్ణరాజపురం, దేవసంద్ర, త్రివేణినగర తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దారులు వాగుల్లా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోకి నీరు చేరడంతో పుస్తకాలు తడిసిపోయాయి. థణిసంద్ర, యలహంక, హెబ్బాళ్, బసవనపుర, లాల్బాగ్, యడియూరు తదితర చెరువులు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజకాలువల మరమ్మతు పనులు పూర్తి కాకపోవడంతో అలుగు పారిన నీరు నేరుగా ఇళ్లలోకి ప్రవహిస్తుంది. నీళ్లతో పాటు పాములు, కప్పలు, చెత్త ఇళ్లలోకి చేరుతుండడంతో స్థానికుల అవస్థలు అన్నీఇన్నీ కావు. రాత్రంతా స్థానికులు జాగారం చేసి వచ్చిన నీటిని డబ్బాల సాయంతో బయటకు తోడి పోస్తున్నారు. రిచ్మండ్ కూడలిలో రిచ్మెండ్ టవర్ నేల అంతస్తు పూర్తిగా నీటితో నిండిపోయింది. వాహనాలు నీట మునిగి పాడయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చిన వాననీటిని యంత్రాల సహాయంతో బయటకు పంపిస్తున్నారు. సుబ్రహ్మణ్యనగర, వసంతపుర చెరువు నిండి అలుగు పారడంతో లోతట్టు ప్రదేశాలు ముంపునకు గురయ్యాయి. పాలికె సిబ్బంది అక్కడికి వచ్చి ఇళ్లు, దారుల్లో నిలబడిన నీటిని బయటకు పంపిస్తున్నారు. కురుస్తున్న వర్షాలకు దారులు పాడై గోతులు పడ్డాయి. హెణ్ణూరు రైల్వేక్రాస్ దారిలో మోకాలి లోతున వాననీరు నిలిచి పోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఆదారిలో ఎక్కడ గుంత ఉందో తెలియని స్థితి నెలకొంది. చినుకు పడితే నగరంలోని ఏదో ప్రాంతం నీట మునుగుతోంది. పాలికె ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది.
నగరంలో వర్షం నిలిచిన తరువాత రహదారుల మరమ్మతు పనులు చేపడతామని బెంగళూరు అభివృద్ధిశాఖ మంత్రి కేజే జార్జి తెలిపారు. కురుస్తున్న వర్షాలకు నగరంలో దారులు పూర్తిగా పాడై గుంతలు పడ్డాయని, వాటిని ఇప్పుడు పూడిస్తే మరలా గుంతలు పడతాయని తెలియజేశారు. వర్షం నిలిచే వరకు మరమ్మతు పనులు చేపట్టబోమని సోమవారం ఇక్కడ ఆయన విలేఖరులకు తెలిపారు. రహదారుల్లో వాననీరు నిలబడటం వల్ల గుంతలు పడుతున్నాయని, ఇరువైపుల ఉన్న కాలువల్లో పూడిక తొలగించక పోవడం అందుకు కారణమన్నారు. అక్కడక్కడ పూడిక పనులు చేపట్టి నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రహదారుల పనుల కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.800కోట్లు విడుదల చేశారని, వాన నిలిచిన తరువాత ఆ నిధుల్ని ఖర్చు చేస్తామన్నారు. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా నిపుణుల సహాయంతో శాశ్వత చర్యలు చేపడతామని తెలిపారు.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!









