'డోక్లాం' పై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నిర్ణయం
- September 05, 2017
73 రోజులుగా భారత్–చైనా దేశాల మధ్య వివాదాలను సృష్టించిన డోక్లాం సమస్యకు ఫుల్స్టాప్ పెట్టాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. సరిహద్దు సమస్యలను పక్కనపెట్టి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని భారత్, చైనా దేశాల అధినేతలు ప్రధాని మోదీ, జిన్పింగ్లు నిర్ణయించారు. జియామెన్లో గంటసేపు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
డోక్లాం వంటి సమస్యలు మళ్లీ ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచకుండా భద్రతా బలగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని అధినేతలు నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య అభిప్రాయభేదాలు వివాదాలుగా మారకుండా చర్చలతో పరిష్కరించుకుందామని మోదీ పిలుపునిచ్చారు. అనంతరం జిన్పింగ్తో జరిపిన ద్వైపాక్షిక సమావేశం ఫలప్రదమైందని మోదీ ట్వీట్ చేశారు.
నిర్మాణాత్మక సంబంధాలపై..
భారత్–చైనా దేశాల అభివృద్ధికి తోడ్పాటునందించేలా సంయుక్త ఆర్థిక, భద్రత, వ్యూహాత్మక బృందాల ఏర్పాటుపైనా మోదీ–జిన్పింగ్ చర్చించారు. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవటంపై ఇద్దరు నేతలు దృష్టిపెట్టారు. రక్షణ, భద్రతా బలగాలు బలమైన సంబంధాలను, సహకారాన్ని పెంపొందించుకుంటూ ఇటీవల జరిగిన పరిస్థితులు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తపడాలని సమావేశంలో నిర్ణయించారు. ‘ఇరు దేశాల అధినేతలు, అధికారుల మధ్య నిర్మాణాత్మక, ముందుచూపుతో కూడిన సమావేశం జరిగింది.
సరిహద్దుల్లో శాంతి నెలకొల్పటంతోపాటుగా ఇరుదేశాల సంబంధాలను అభివృద్ధి చేసుకునే దిశగా చర్చలు జరిగాయి’ అని చర్చల వివరాలను భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ చెప్పారు. ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలున్నప్పటికీ పరస్పర గౌరవంతో ఉమ్మడి వేదిక ద్వారా వీటిని పరిష్కరించుకునేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోనున్నారు. ఈ అభిప్రాయభేదాలు వివాదాలుగా మారకుండా ‘ఆస్తానా’ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు జిన్పింగ్కు మోదీ అభినందనలు తెలిపారు.
తెరపైకి పంచశీల సూత్రాలు
‘పంచశీల శాంతి సూత్రాలు, పరస్పర రాజకీయ విశ్వాసం, పరస్పర ప్రయోజన సహకారం, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి విషయంలో భారత్తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉంది’ అని జిన్పింగ్ అన్నారు. ‘భారత్, చైనా దేశాలు ఒకరికొకరు అవకాశాలు మాత్రమే. ముప్పు కాదు. ఇరుదేశాలు ఒకరికొకరు ముఖ్యమైన పొరుగుదేశాలు, కీలకమైన మార్కెట్లు, వర్దమాన దేశాలు. చైనా అభివృద్ధిని భారత్ సరైన, హేతువాద దృష్టికోణంతో చూస్తుందని భావిస్తున్నాం’ అని అన్నారు.
‘సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు మనం కలిసి పనిచేద్దాం’ అని అన్నారు. సరిహద్దుల్లో శాంతి, సమానత్వం పెంచే అంశంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కలిసి కృషిచేయాలని జిన్పింగ్ పేర్కొన్నారని.. చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గెంగ్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, భాగస్వామ్యాన్ని బలోపేతం కోసం రెండు ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో పనిచేస్తున్నాయని ఇరువురు నేతలు పేర్కొన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









