సుష్మా స్వరాజ్‌తో డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ భేటీ

- September 18, 2017 , by Maagulf
సుష్మా స్వరాజ్‌తో డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ భేటీ

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, ఆయనకు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఇవాంకా ట్రంప్‌ మంగళవారం న్యూయార్క్లో భేటీ అయ్యారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి వీరివురు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఇవాంకా...సుష్మాను కలిశారు. ఈ సమావేశంలో మహిళా వ్యవస్థాపకతతో పాటు ఇరుదేశాలలో శ్రామిక అభివృద్ధికి సంబంధించి చర్చ జరిగింది.
ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్‌పై ఇవాంకా ట్విట్టర్‌లో ప్రశంసల జల్లు కురిపించారు.  సుష్మా స్వరాజ్‌ ‘ఆకర్షణీయమైన’ విదేశాంగ మంత్రిగా అభివర్ణించిన ఆమె.. సుష్మాను కలుసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.  మహిళా సాధికారితతో పాటు  భారత్, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే  జీఈఎస్ (పారిశ్రామిక వ్యవస్థాపకులు) సదస్సుకు సంబంధించి తమ మధ్య చర్చ జరిగినట్లు ఇవాంకా తెలిపారు.
కాగా భారత, అమెరికా దేశాల ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ శిఖరాగ్ర పారిశ్రామికవేత్తల సదస్సు (గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌)-2017.. నవంబర్ 28 నుంచి 30 వరకూ హైదరాబాద్లో (జీఈఎస్) జరగనుంది. ఈ సదస్సుకు అమెరికా తరఫున ఇవాంకా హాజరు అవుతున్నారు.  అలాగే  ఈ నెల 23న ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధుల సభ 72వ వార్షిక సమావేశంలో సుష్మా స్వరాజ్‌ ప్రసంగించనున్నారు. మరోవైపు ఇండియన్‌ ఎంబసీ కూడా న్యూయార్క్‌లో సుష్మా, ఇవాంకా భేటీకి సంబంధించి ఓ ఫోటోను ట్విట్‌ చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com