రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముగిసిన దసరా వేడుకలు

- September 30, 2017 , by Maagulf
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముగిసిన దసరా వేడుకలు

లుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు ముగిశాయి.. తొమ్మిదిరోజులపాటు ఆలయాల్లో సందడి వాతావరణం కనిపించింది.. విజయదశమిరోజు నిజరూపంలో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పలు చోట్ల తెప్పోత్సవం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్‌ భద్రకాళి ఆలయ చెరువులో అమ్మవారి జలక్రీడోత్సవం వైభవంగా నిర్వహించారు. నవరాత్రులు పూర్తవడంతో తెప్పోత్సవం నిర్వహించారు. స్వామితో కలిసి భద్రకాళి అమ్మవారు తటాకంలో విహరించారు. తెప్పోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఉత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఇక తొమ్మిదిరోజులు తొమ్మిదిరూపాల్లో దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు.. విజయదశమిరోజు నిజరూపంలో సాక్షాత్కరించారు. అమ్మవారిని నిజరూపంలో దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. 
కరీంనగర్‌లోని గిద్దపెరుమాండ్ల ఆలయంలో శమీపూజల్లో మంత్రి ఈటెల రాజేందర్‌ పాల్గొన్నారు. గిద్దెపెరుమాండ్ల స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ని ప్రార్థించినట్లు ఈటెల రాజేందర్‌ తెలిపారు. 
నిజామాబాద్‌ జిల్లాలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో ఎంపీ కవిత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రావణ దహనం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. 
మహబూబ్‌నగర్‌లోని వేణుగోపాలస్వామి ఆలయంలో విజయదశమి వేడుకలు అట్టహాసంగా  జరిగాయి. శమీపూజ నిర్వహించారు అర్చకులు. అమ్మవారికి, జమ్మిచెట్టుకు పూజలు చేసి ఆకులు, అక్షితలు తీసుకున్నారు. అనంతరం హన్మంతుని వీధిలో రావణ వధ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. 
విశాఖలో దసరా వేడుకలు ఘనంగా ముగిశాయి. విజయదశమి సందర్భంగా నగరంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తొమ్మిదిరోజులపాటు అమ్మవారిని వివిధ అలంకరణల్లో దర్శించుకున్న భక్తులు.. చివరి రోజు నిజరూపంలో అమ్మవారికి పూజలు చేశారు. దసరా పర్వదినం సందర్భంగా కనకమహాలక్ష్మి, కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. 
విజయనగరంలో విజయదశమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు ప్రజలు. శరన్నవరాత్రుల్లో చివరిరోజు ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు అర్చకులు. 
పశ్చిమగోదావరి జిల్లా ద్వరకా తిరుమల ఆలయంలో కుంకుళ్లమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల ముగింపు నేపథ్యంలో అమ్మవారిని పూల రథంపై పురవీధుల్లో ఊరేగించారు. 
గుంటూరు రూరల్, అర్బన్ పోలీసు ఆఫీసుల్లో విజయదశమి సంబరాలు నిర్వహించారు. ఆయుధ పూజలో రూరల్ ఎస్పీ అప్పలనాయుడు, అర్బన్ ఎస్పీ విజయరావు పాల్గొన్నారు. తరువాత ఉద్యోగులందరితో కలిసి నృత్యాలు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com