ఇక పై ఎస్ఎంఎస్ల ద్వారా రైల్వే రిజర్వేషన్ కన్ఫర్మేషన్

- October 10, 2017 , by Maagulf
ఇక పై  ఎస్ఎంఎస్ల ద్వారా రైల్వే రిజర్వేషన్ కన్ఫర్మేషన్

- టికెట్‌తో పాటు మెసేజ్‌ చార్జీల వడ్డన 
దుబారా ఖర్చులను తగ్గించుకునే పేరుతో రైల్వే శాఖ ప్రయాణికులపై భారం మో పేందుకు సిద్ధమైంది. పండుగలు, ఉర్సు ఉత్సవాలు, జాతర్లు, పుష్కరాల సమయాల్లో ప్రత్యేక రైళ్లంటూ అదనపు చార్జీలు వసూలు చేయడమే కాకుండా దసరా, దీపావళి, సంక్రాంతి పండగల రోజు ప్లాట్‌ఫామ్‌ టికెట్లను పెంచి రైల్వే సంస్థ ప్రయాణీకులపై భారం మోపుతూ వస్తున్నది. వారం పదిహేను రోజుల ముందు టికెట్లను రిజర్వేషన్‌ చేయించుకున్నా కన్ఫర్మ్‌ కావు కానీ అదే రోజు ప్రయాణించాలనుకునే వారు అదనపు చార్జీలు భరించేందుకు సిద్ధమైతే తత్కాల్‌ టికెట్లంటూ బోగీ, సీటు, బెర్తు కన్ఫర్మ్‌ అవుతాయి. ఈ దోపిడీతోనే ప్రయాణికులు సతమతమవుతూ ఉంటే ఇకపై బోగీలపై అంటించే బెర్త్‌, సీటు కన్ఫర్మేషన్‌ చార్ట్‌కు మంగళం పాడాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్‌ చార్ట్‌లను తొలగించి వాటి స్థానంలో ప్రయాణికుడి సెల్‌ఫోన్‌కు కన్ఫర్మేషన్‌ మెసెజ్‌ చేయనుంది. ఈ విధానాన్ని కొద్దిరోజులక్రితం దేశంలోని ఏడు ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రయాణికుల స్పందన ఏవిధంగా ఉంటుందో అధ్యయనం చేసిన తర్వాత మిగతా స్టేషన్లకూ విస్తరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రయాణికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సెల్‌ఫోన్‌ లేని వారికి రైల్వే శాఖ సమాచారం ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. రైళ్లల్లో ప్రయాణిస్తున్న వారిలో దాదాపు 85 శాతం మంది సెల్‌ఫోన్లు వాడట్లేదని, అలాంటప్పుడు వారు రిజర్వేషన్లు చేయించుకుంటే వారి పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు. చార్టులు లేక, అటు సెల్‌ఫోన్లు లేక ప్రయాణికులు ఏ బోగీలోకి ఎక్కి కూర్చోవాలని ప్రశ్నిస్తున్నారు.

బోగీలపై రిజర్వేషన్‌ చార్ట్‌లు, ఎస్‌ఎంఎస్‌ విధానం గత కొన్నేండ్ల నుంచి రైల్వేలో అమలవుతున్నది. అయితే ఫోన్‌కు మెసెజ్‌ పంపినా అది ఉచితం కాదు. రిజర్వేషన్‌ చేయించుకునే సమయాల్లోనే ప్రయాణికుడి నుంచి టికెట్‌ రుసుముతో పాటు అదనంగా నాలుగు నుంచి పది రూపాయలను రైల్వేశాఖ వసూలు చేయనుంది. అదేంటంటే స్వచ్‌ భారత్‌...

స్వచ్‌ రైల్‌ పేరిట రైలు బోగీలను శుభ్రంగా ఉంచేందుకు రిజర్వేషన్‌ చార్ట్‌లు అంటించొద్దని నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ ప్రకటన చేయడం గమనార్హం. వాస్తవానికి రిజర్వేషన్‌ చార్టులు బోగీలకు, ప్లాట్‌ఫామ్‌లో నోటీస్‌ బోర్డులకు అంటించడం వల్ల సాలీనా కోట్ల రూపాయలకు పైగా డబ్బు దుబారా అవుతుందని, వీటిని తగ్గించుకునేందుకు గానూ రైల్వే శాఖ చార్ట్‌లు వద్దు...ఎస్‌ఎంఎస్‌లే ముద్దు అనే నినాదం తీసుకున్నదని తెలుస్తోంది. చార్ట్‌ల వల్ల దక్షిణ మధ్య రైల్వేకు సాలీనా కోటి రూపాయలకు పైగా అదనపు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.తెలంగాణలోని సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌ స్టేషన్లలో చార్ట్‌లను అంటించడం వల్ల ప్రతి ఏటా ఆరువేల పేపర్‌ రోల్స్‌ ఖర్చవుతున్నాయి. దీని ఖరీదు రూ.35 లక్షలుంటుందని అధికారులు తెలిపారు.

ఇప్పటికే అనేక రూట్లలో పీపీపీ (ప్రయివేటు పబ్లిక్‌ పార్టనర్‌ షిప్‌) పద్ధతిలో రైల్వే ట్రాక్‌లను ప్రయివేటు కంపెనీలకు ధారాదత్తం చేసిన కేంద్రం కేటరింగ్‌, వాషింగ్‌, హౌస్‌కీపింగ్‌, బోగీల క్లీనింగ్‌, ఏజెంట్ల ద్వారా టికెట్‌ కౌంటర్లు తెరిచి ప్రయాణికుల జేబులకు చిల్లుపడేటట్టు చేసింది. రాబోయే కొద్ది రోజుల్లోనే టికెట్‌ కన్ఫర్మషన్‌ వ్వవస్థను ప్రయివేటీకరించి కాంట్రాక్టర్లకు అప్పగించే యత్నం జరుగుతోందని విశ్వసనీయంగా తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com