తుపాను భయంతో వణుకుతోన్న ఉత్తరాంధ్ర

- October 16, 2017 , by Maagulf
తుపాను భయంతో వణుకుతోన్న ఉత్తరాంధ్ర

తుపాను భయంతో ఉత్తరాంధ్ర వణుకుతోంది.. మూడేళ్ల కిందట హుదూద్‌ మిగిల్చిన నష్టం నుంచి ఇంకా బయటపడకముందే మరో తుపాను భయపెడుతోంది.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది.
ఈ నెల 19న ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా మధ్య తీర ప్రాంతాన్ని తాకుతుందని అంచనా వేస్తోంది. అయితే వాయుగుండంగా ఏర్పడిన తర్వాతే దాని తీవ్రతపై ఒక స్పష్టత వస్తుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాయుగుండం పయనించే వేగం నెమ్మదిగా ఉంటే బలంగా మారుతుందని, వేగంగా పయనిస్తే సాధారణ వాయుగుండంగానే తీరాన్ని తాకుతుందంటున్నారు.
వాయుగుండం ప్రభావంతో ఈరోజు నుంచే భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ అధికారులు. రేపట్నుంచి కోస్తా, ఒడిశాలో అతి భారీ వర్షాలు, తెలంగాణ, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడతాయన్నారు. అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు తుపాను ముప్పు ఉన్నట్లు ఇస్రో గుర్తించడంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఎప్పటి కప్పుడు వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేయాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com