ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో రేవంత్ రెడ్డి
- October 17, 2017
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి భారీ షాక్ తగలనుందా? తెలంగాణలో దిక్కులేని అనాథలా మారిన తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగలనుందా? పార్టీని ముందుండి నడిపిస్తున్న ఏకైక కీలక నాయకుడు టీడీపీకి గుడ్ బై చెబుతారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ టీడీపీ కీలక నేత, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు సంచలనంగా మారాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే వార్త తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయడం, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉండటం.. ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది.
రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోనే మకాం వేసిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారని, ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ పగ్గాలు అందుకునేలోపు రేవంత్ కాంగ్రెస్ చేరుతారని సమాచారం. రేవంత్ కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేయలేకపోతోందనే భావనతోనే కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయానికి రేవంత్ వచ్చినట్టు చెబుతున్నారు.
టీడీపీ అధిష్టానంపై కొంత కాలంగా రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఆయన టీడీపీని వీడతారు అని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అనంత ఎపిసోడ్ తర్వాత రేవంత్ రెడ్డిలో అసంతృప్తి మరింతగా పెరిగిందని సమాచారం. పరిటాల శ్రీరామ్ పెళ్లిలో.. కొందరు టీడీపీ నేతలు సీఎం కేసీఆర్ తో సన్నిహితంగా మెలగడం రేవంత్ రెడ్డికి అస్సలు నచ్చలేదట. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా తాను తీవ్రంగా పోరాటం చేస్తుంటే.. టీడీపీ నేతలేమో ఆయనతో రాసుకుని పూసుకుని తిరుగుతుండటం రేవంత్ జీర్ణించుకోలేకపోయారట. వరుస పరిణామాల నేపథ్యంలో ఇక టీడీపీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి రేవంత్ రెడ్డి వచ్చారని సమాచారం.
కాగా, తాను కాంగ్రెస్ లో చేరనున్నట్టు వస్తున్న వార్తలపై రేవంత్ రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని వస్తున్న వార్తలను ఖండించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా









