ఉత్తర కొరియాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు
- November 03, 2017
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసియా దేశాల పర్యటనకు ముందు.. ఆ దేశం ఉత్తర కొరియాకు ఝలక్ ఇచ్చింది. కొరియా ద్వీపంపై యుద్ధ విమానాలతో డ్రిల్ నిర్వహించింది. అమెరికా అధీనంలోని భూభాగమైన ఈ గువామ్ ద్వీపాన్ని పూర్తిగా నాశనం చేస్తామంటూ ఇటీవల ఉత్తరకొరియా హెచ్చరికలు చేసింది. దీనికి బదులిచ్చేందుకు అమెరికా తాజా డ్రిల్ చేపట్టింది. ఉత్తరకొరియాకు తమ సైనిక సామర్థ్యాలను తెలియజేసేందుకు గువామ్లోని అండర్సన్ ఎయిర్ఫోర్స్ బేస్ నుంచి రెండు సూపర్సోనిక్ యుద్ధవిమానాలను కొరియా ద్వీపంపైకి పంపింది. వీటిని ఎస్కార్ట్ చేస్తూ దక్షిణకొరియా ఫైటర్జెట్లు కూడా ఈ డ్రిల్లో పాల్గొన్నాయి.
ఈ డ్రిల్తో అమెరికా, ఉత్తరకొరియా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాను నాశనం చేస్తామంటూ వరుస హెచ్చరికలను చేస్తున్న ఉత్తరకొరియాకు అగ్రరాజ్యం దీటుగా బదులిస్తోంది. ఇందులో భాగంగానే దక్షిణ కొరియాతో కలిసి అనేకసార్లు కొరియా ద్వీపంపై యుద్ధవిమానాల డ్రిల్ నిర్వహించింది. ఐతే.. ఈ సారి ఉత్తరకొరియా లక్ష్యంగా చేసుకున్న గువామ్ ద్వీపం నుంచి ఈ డ్రిల్ చేపట్టింది. గ్వామ్లోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి రెండు బీ–1బీ లాన్సర్ యుద్ధ విమానాలు పశ్చిమ జపాన్లో ఆ దేశ ఎయిర్ ఫోర్స్ విమానాలతో కలిసి సంయుక్త విన్యాసాలు జరిపాయని అమెరికా పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అనంతరం లాన్సర్ విమానాలు యెల్లో సీపై కొరియా యుద్ధ విమానాలతో కలిసి విన్యాసాల్లో పాల్గొని.. గ్వామ్లోని యుద్ధ విమానాల స్థావరానికి తిరిగి చేరుకున్నాయని తెలిపింది. పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి యుద్ధ విన్యాసాల్లో భాగంగానే ఇవి కొనసాగాయని, కొరియా ద్వీపకల్పంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో వీటికి ఎలాంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో అమెరికా స్పష్టం చేసింది.
మరోవైపు అమెరికా డ్రిల్ను ఉత్తరకొరియా ఖండించింది. ఈ డ్రిల్ను ‘ఆకస్మిక అణు దాడి విన్యాసాలు’గా ఉత్తర కొరియా తీవ్రంగా తప్పుపట్టింది. అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు అణు యుద్ధానికి ఆజ్యం పోసేందుకు చూస్తున్నాయని ఉత్తరకొరియా పేర్కొంది. అయితే, తమ సైన్యం, ప్రజలు ఇలాంటి వాటికి ఎన్నడూ భయపడబోరని చెప్పింది. ఆదివారం నుంచి ట్రంప్ ఆసియా పర్యటన మొదలు కానుంది. ముందు జపాన్ వెళ్లనున్న ట్రంప్.. అక్కడి నుంచి దక్షిణకొరియా, చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరకొరియా వల్ల పొంచి ఉన్న అణు ముప్పుపై ఆయా దేశాధినేతలతో చర్చించే అవకాశముంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







