రాజస్థాన్లోని జైపూర్లో పద్మావతి ట్రైలర్ను రిలీజ్ చేసిన థియేటర్ పై దాడి
- November 14, 2017
పద్మావతి సినిమా వివాదం రోజురోజుకు ముదురుతోంది. రాజ్ పుత్ వీరనారి పద్మావతి క్యారెక్టర్ను దెబ్బతీసేలా సినిమా తీశారంటూ రాజ్పుత్ సంఘాలు ఆందోళనలను ఉధృతం చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్లోని కోటలో ఓ ధియేటర్లో కర్ణిసేన దాడికి దిగింది. డిసెంబర్ 1న సినిమాను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన ట్రైలర్ను కోట లోని ఓ ధియేటర్లో ప్రసారం చేశారు. దీంతో రెచ్చిపోయిన కర్ణిసేన.. ఆ సినిమా హాలుపై దాడి చేసింది. కొందరు యువకులు అద్దాలను పగలగొట్టారు.
ఇక రాజస్థాన్లోని జైపూర్లో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పద్మావతి సినిమా రిలీజ్ను నిలిపివేయాలంటూ బ్యానర్ ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. తమ ఆడపడుచు అయిన రాణి పద్మావతి గురించి తప్పుడుగా చూపిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
క్రీస్తుశకం 13, 14 శతాబ్దాలనాటి యదార్థ గాధ ఇది. రాజస్థాన్లో ప్రచారం ఉన్న కథల ప్రకారం... సింఘాల్ రాజ్య యువరాణి అయిన పద్మావతి అందచందాలకు దేశంలో అనేకమంది రాజులు ముగ్ధులవుతారు. చిత్తోర్గఢ్ పాలకుడైన రతన్సేన్ ఆమెను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. పద్మావతి సౌందర్యం గురించి విన్న ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఆమెను సొంతం చేసుకోవడానికి చిత్తోర్గఢ్పై దండెత్తుతాడు. అనేక నాటకీయ పరిణామాల మధ్య పద్మావతి భర్త రతన్సేన్ చనిపోతాడు. ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ తమ కోటను స్వాధీనం చేసుకుంటాడనగా.. అతనికి వశం కాకుండా అగ్నికి ఆహుతి అవుతుంది పద్మావతి. వందలాది రాజ్పుత్ స్త్రీలతో కలిసి అగ్నిగుండంలో ఆత్మాహుతి చేసుకుంటుంది.
పర పురుషుడికి వశం కావడమనే ఆలోచననే సహించలేక.. ఆత్మార్పణకు సైతం సిద్ధపడిన పద్మావతి క్యారెక్టర్ను సినిమాలో తప్పుగా చిత్రీకరించారని రాజ్పుత్లు ఆరోపిస్తున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీతో పద్మావతికి ప్రేమాయణం ఉన్నట్టుగా చూపారని ఆగ్రహిస్తున్నారు. సినిమాను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లినా.. అక్కడ న్యాయస్థానంవారి వాదనను కొట్టేసింది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. మరోవైపు రాజస్థాన్ ప్రభుత్వం కూడా దీనిపై ఓ హైలెవల్ కమిటీని వేసి సినిమాను చూడాల్సిందిగా సూచించింది. వారు సూచించిన మార్పులు చేశాక మూవీ రిలీజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. ఓ వైపు ఈ ప్రక్రియ నడుస్తుండగా.. ఇప్పుడు కర్ణిసేన ధియేటర్ల మీద దాడులు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. తమకు రక్షణ ఇవ్వాలంటూ ధియేటర్ల యజమానులు కోరుతున్నారు. ఇలాగైతే సినిమాను తాము తీసుకోలేమంటూ చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









