బ్రిటన్‌, ఇయుల మధ్య కుదిరిన ఒప్పందం.!

- December 08, 2017 , by Maagulf
బ్రిటన్‌, ఇయుల మధ్య కుదిరిన ఒప్పందం.!

బ్రిటీష్‌ ప్రధాని థెరిస్సా మే, యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు జేన్‌ క్లాడ్‌ జుంకర్‌ల మధ్య జరుగుతున్న బ్రెగ్జిట్‌ చర్చల్లో శుక్రవారం తెల్లవారు జామున ఒప్పందం కుదిరింది. భవిష్యత్‌లో ఇయు-బ్రిటన్‌ వాణిజ్య సంబంధాలపై చర్చలు జరిపే రెండో దశను చేపట్టడానికి ఇరువురు నేతలు అనుమతించారు. ఐర్లాండ్‌కు సంబంధించినంతవరకు కఠినమైన సరిహద్దు వుండబోదని థెరిస్సా స్పష్టం చేశారు. కాగా, యురోపియన్‌ యూనియన్‌ నుండి బ్రిటన్‌ వైదొలగడానికి కన్నా మరింత కఠినమైన నిబంధనలు, పరిస్థితులు రెండో దశ చర్చల్లో వుంటాయని ఇయు చర్చలకు సంబంధించిన ముఖ్య ప్రతినిధి హెచ్చరించారు. ఇయు వైపునుండి చర్చించడానికి వీల్లేనటువంటి కొన్ని అంశాలు కూడా వుంటాయని వాటికి కట్టుబడి వుండాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే థెరిస్సా పేర్కొంటున షరతులపై కూడా కమిషన్‌ అధ్యయం చేసింది. 2016లో కెనడాతో ఇయు కుదుర్చుకున్నరీతిలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక్కడే బ్రిటన్‌కు ఇవ్వగల అవకాశమని పేర్కొన్నారు. కాగా, బ్రిటన్‌ అంతర్గత మార్కెట్‌ సమగ్రతను ఈ తాజా ఒప్పందం గుర్తించి, కొనసాగిస్తుందని థెరిస్సా పేర్కొన్నారు.

అయితే ఈ ఒప్పందంలో ఉత్తర ఐర్లాండ్‌ పట్ల ఏ విధమైన ప్రత్యేక వైఖరి వుండబోదని ఆమె స్పష్టం చేశారు. విజయవంతమైన ఒప్పందం కుదిరిన విషయాన్ని జుంకర్‌ కూడా ధృవీకరించారు. అవసరమైన పురోగతిని సాధించామని ఆయన వ్యాఖ్యానించారు. సవాలుగా పరిణమించిన బ్రెగ్జిట్‌ చర్చల్లో రెండో దశకు మనం సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ ఒప్పందం అనేది ఒక విధంగా రాజీనే అని ఆయన వ్యాఖ్యానించారు. జుంకర్‌తో సమావేశానంతరం థెరిస్సా మే యురోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌తో సమావేశం కానున్నారు. రెండేళ్ళ పాటు పరివర్తనా కాలం వుండాలని బ్రిటన్‌ కోరుతోందని అందుకు ప్రతిగా ఇయు విధించిన నిబంధనలకు, చట్టాలకు బ్రిటన్‌ కట్టుబడి వుండాల్సిన అవసరముంటుందని టస్క్‌ చెప్పారు. విధానాలు, వాణిజ్యం విషయాల్లో ఇయు, బ్రిటన్‌లు సన్నిహిత భాగస్వామ్యాన్ని కొనసాగించగలరని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. వాణిజ్యంలో భాగస్వామ్యంతో పాటు తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలపై ఉమ్మడి పోరు చేపట్టడానికి సిద్ధంగా వున్నామని టస్క్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com