చిక్కుల్లో పడ్డ ఎయిర్ ఇండియా

- December 13, 2017 , by Maagulf
చిక్కుల్లో పడ్డ ఎయిర్ ఇండియా

వరుస వివాదాలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. సిబ్బంది రాకపోవడంతో బుధవారం ఓ ఎయిరిండియా విమానం గంటన్నర ఆలస్యంగా బయల్దేరింది. ఆ విమానంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు కూడా ఉన్నారు. ఈ ఘటనపై మంత్రిగారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఓ ఎయిరిండియా విమానం బుధవారం గంటన్నర ఆలస్యంగా బయల్దేరింది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 6 గంటలకు ఆ విమానం బయల్దేరాల్సి ఉంది. ప్రయాణికులంతా తమ సీట్లలో కూర్చున్నారు. అయితే పైలట్‌, సిబ్బంది సమయానికి రాకపోవడంతో ప్రయాణం ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. అదే విమానంలో ఉన్న కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజును చుట్టుముట్టి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రమంత్రి వెంటనే ఎయిరిండియా చీఫ్‌ ప్రదీప్‌ ఖరోలాకు ఫోన్‌ చేసి ఆలస్యంపై నిలదీశారు. 
అయితే మంచు ఎక్కువగా ఉండటంతో విమానాన్ని ఆపినట్లు ఎయిరిండియా అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని గ్రౌండ్‌ సిబ్బందికి చెప్పడం ఆలస్యమైందని.. దీంతో వారు ప్రయాణికులను ఎక్కించుకున్నారని చెప్పారు. అంతేగాక.. భద్రతా తనిఖీల కారణంగా పైలట్‌ కూడా 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినట్లు వెల్లడించారు. ఘటనపై చర్యలు చేపట్టామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. సమాచారాన్ని చేరవేయడంలో అలసత్వం ప్రదర్శించిన ముగ్గురు సిబ్బందిని సస్పెండ్‌ చేశామని.. పైలట్‌ను హెచ్చరించినట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com