వైజాగ్‌లో ఈ బండి ఎక్కితే నేలమీద, నీటిపై రయ్ రయ్...

- February 17, 2018 , by Maagulf
వైజాగ్‌లో ఈ బండి ఎక్కితే నేలమీద, నీటిపై రయ్ రయ్...

విశాఖకి మరో మణిహారం రాబోతుంది. గత నెలలో యుద్ధ విమానం, హెలీ టూరిజమ్‌ను అందుబాటులోకి తెచ్చిన పర్యాటక శాఖ.. ఇప్పుడు హోవర్ క్రాఫ్ట్‌ను సిద్ధం చేస్తోంది. నేల, నీటిపై రయ్ రయ్ మంటూ ఎంజాయ్ చేసే అవకాశాన్ని కల్పించబోతుంది. మార్చి నెలాఖరు నుంచి పర్యాటకులకు ఈ సేవలు అందుబాటులోకి రానుంది.

స్మార్ట్ సిటీగా ఎదుగుతోన్న విశాఖ.. పర్యాటక రంగానికి స్వర్గధామంగా మారుతోంది. బీచ్‌ సిటీగా.. దేశ, విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తోంది. సహజ సిద్ధమైన అందాలతో పర్యాటకుల మనసు దోచుకుంటోంది. కైలాసగిరి, సబ్ మెరైన్, ఎర్రమట్టి దిబ్బలను చూసి ప్రకృతి ప్రియులు తన్మయత్వం చెందుతున్నారు. అటు ప్రభుత్వం కూడా.. పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. 

నీలి సంద్రంలో కేరింతలు కొట్టేందుకు, కెరటాలతో ఆడుకునే అవకాశాన్ని.... పర్యాటకులకు కల్పించేందుకు ఏపీ టూరిజం శాఖ హోవర్ క్రాఫ్ట్‌లు సిద్ధం చేస్తోంది. తీరం నుంచి రెండు కిలోమీటర్ల మేర సముద్రం లోపలికి వెళ్లి చక్కర్లు కొట్టేలా హోవర్ డాక్‌కు చెందిన రెండు హోవర్ క్రాఫ్ట్‌లను విశాఖ తీసుకొచ్చింది. ప్రస్తుతం సన్‌ రే రిసార్ట్స్ సమీపంలో ఉంచి పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. మార్చి నెలాఖరు నాటికి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానుంది.

విశాఖలోని గోకుల్ పార్క్‌ సమీపంలో హోవర్ డాక్ సంస్థకు జీవిఎంసీ 4వేల గజాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ఇప్పటికే అన్ని అనుమతులు మంజూరు చేసింది. హోవర్ క్రాఫ్ట్‌ లో ప్రయాణించేందుకు 300 నుంచి 500రూపాయలు చార్జ్ చేసే అవకాశముంది. త్వరలోనే ధరలు ఖరారు చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com