నేడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి !!
- March 15, 2018అమరజీవి సమరగాధ ...
నేడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి !!
-------------------------------------------------------------------------------------------------------
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు గుర్తున్నారా? ఆయన జయంతి నేడు..ఆ మహానుభావుడని కేవలం ఒక సామాజికవర్గానికి పరిమితం చేసి మిగిలిన వారిలో కొందరు కనీసం ఆయన త్యాగాన్నిగుర్తు చేసుకోకపోవడం ఘోరమైన తప్పిదం. తెలుగు రాష్ట్ర స్థాపన కోసం అసువులు అర్పించిన అమరజీవి, త్యాగధనుడు పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీ రాములుగారు నెల్లూరు జిల్లాలోని పడమటి పల్లి గ్రామంలో 1901 మార్చి 16వ తేదిన జన్మించారు. ఇంజినీరింగ్ చదివిన ఆయన1925 లో ఉద్యోగమును మానివేసి తన జీవితాన్ని దేశానికి అంకితంచేయాలి అనుకొని గాందీజీకి అనుయాయుడిగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం 1952 అక్టోబరు 19 నుండి 58 రోజులు కఠోరమైన ఉపవాస వ్రతమును సాగించారు. ఆ అమరజీవి ఆత్మార్పణ ఫలితంగానే నెహ్రూ గారి ఆమోదంతో కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం 1953 అక్టో బరు 1 న ఏర్పడింది.
అవి...మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న రోజులు ... తెలుగువారంతా ఏకమై ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం గొంతు విప్పిన ఉద్రిక్త వాతావరణం...తెలుగు నాయకులంతా ముక్త కంఠంతో తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న రోజులు...ప్రత్యేక తెలుగు రాష్ట్రాన్ని కచ్చితంగా ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, రాయలసీమ కు గుండె వంటి కర్నూలు ని రాజధానిగా ఏర్పాటు చేయడం... వంటి విషయాల గురించి తెలుగు నాయకులంతా విస్తృతంగా, తీవ్రంగా చర్చించుకుంటున్న రోజులు అవి. అయితే, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక, ఈ విషయం వెనకబడిపోయింది. 1949లో ఒకసారి, 1952లో ఒకసారి ఈ అంశం తెర మీదకు వచ్చినా, అధికారులెవ్వరూ ఈ విషయం మీద పూర్తి శ్రద్ధ వహించలేదు. ప్రముఖ గాంధేయవాది అయిన పొట్టి శ్రీరాములు సరిగ్గా ఆ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరశన దీక్ష ప్రారంభిస్తానన్నారు.ఆ నిరశన వ్రతం ప్రారంభించడానికి స్థలం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. పొట్టి శ్రీరాములు పట్టుదల మనిషి. ‘ఎవ్వరూ స్థలం ఇవ్వకపోతే నా దీక్ష ఏ మాత్రం ఆగదు. ముందూ వెనుకా అట్టలు కట్టుకుని వీధులలో తిరుగుతూ ప్రాణాలు విడుస్తాను’ అని ప్రకటించిన పట్టుదల మనిషి శ్రీరాములు. బులుసు సాంబమూర్తి ఆయన వ్రతానికి ఆశ్రయం ఇచ్చాడు. గాంధీజీతో మన చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైతే, శ్రీరాములు ఆత్మబలిదానంతో మన చరిత్ర మరొక కొత్త మలుపు తిరిగింది. అక్టోబరు 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి, డిసెంబరు 16వ తేదీ మంగళవారం, 58 రోజుల ఉపవాస దీక్షతో పొట్టి శ్రీరాములు అమరులయ్యారు. ఆయన మరణంలో తెలుగు వారు ఒక్కసారిగా హింసామార్గంలో ప్రవేశించారు. మైలాపుర్ లజ్ కార్నర్ సమీపంలో నెం. 89, రాయపేట్ హైరోడ్, ఇల్లు సాంబమూర్తి గారి నివాసగృహం. అక్కడే పొట్టి శ్రీరాములు కృశించిన, జీవం లేని దేహమున్న పవిత్ర స్థానం. ఆ గృహం ముందరి ప్రదేశంలోనే కర్రలతో, కొబ్బరి ఆకులతో నిర్మించిన వేదికపై శ్రీరాములు పార్థివదేహాన్ని ఉంచారు. శ్రీరాములు మరణవార్త దావానలంలా దేశమంతటా వ్యాపించింది. ఈలోగానే తండోపతండాలుగా వచ్చే జనంతో వీధివీధంతా కిక్కిరిసిపోయింది. వచ్చినవారు అమరజీవిని అంతిమ దర్శనం చేసుకొని ఆయన శరీరం మీద పుష్పమాలలు వుంచి అశ్రునేత్రాలతో మరలుతున్నారు.ఆ నాటి మధ్యాహ్నం రెండు గంటలకు ఆ ఇంటి వద్ద నుంచి పొట్టి శ్రీరాములు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆ యాత్ర సాగుతున్నంతసేపు ఘంటసాల, మోపర్రుదాసు... అందరి హృదయాలు ద్రవించేలా జాతీయగీతాలను ఆలపించారు. మేడలపై నుంచి పౌరులు పూలవానలు కురిపిస్తూ, ‘పొట్టి శ్రీరాములు అమర్ రహే, మద్రాసు నగరం రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలి’ వంటి నినాదాలు దిక్కులు పిక్కటిల్లేలా చేశారు. ‘‘శ్రీరాములు చనిపోలేదు. అతడు అమరజీవి అయ్యాడని పెద్దలందరూ కన్నీటితో నిండిన గుండె బరువుతో ఆక్రోశించారు. ఊరేగింపులో పాల్గొన్నవారిలో తెలుగు వారే కాదు, తమిళులు తదితరులు కూడా ఉన్నారు. మద్రాసు తెలుగువారి పట్ల తమిళులు ఎప్పుడూ ఆదరభావాన్నే ప్రదర్శిస్తూ వచ్చారు. సాంబమూర్తి గారి ప్రైవేట్ కార్యదర్శి శ్రీరామదేశికర్ తమిళుడు! అయినా ఆ ఊరేగింపు ఏర్పాట్లలో ప్రముఖ పాత్ర నిర్వహించారు.శ్రీరాముల ఆత్మబలిదాన ఫలితంగా ఎన్నడూ అనుకోని విధంగా మదరాసు నగరంలోనూ, ఆంధ్రరాష్ట్రంలోనూ మాత్రమే కాక దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా చెలరేగిన సంక్షోభం ఒక్కసారిగా నెహ్రూ కూర్చున్న సింహాసనాన్ని కుదిపేసింది. మరో ఆలోచన లేకుండా డిసెంబరు 19న, భాషా ప్రాతిపదికన, నెహ్రూ ప్రత్యేక తెలుగు రాష్ట్రం ప్రకటించారు. ఇందులో కోస్తా ప్రాంతం, కర్నూలు రాజధానిగా రాయలసీమ, ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా... 1953, అక్టోబరు 1 న ప్రత్యేక తెలుగు రాష్ట్ర ప్రకటన జరిగింది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!