ఐటీ పరిశ్రమలు తిరుపతి వైపు ..

- December 10, 2015 , by Maagulf
ఐటీ పరిశ్రమలు తిరుపతి వైపు ..

గత 100 ఏళ్లలో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు, వరదలు కురవడంతో చెన్నై మహానగరం మొత్తం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వరదలు కారణంగా చెన్నై ఐటీ పరిశ్రమకు వందల కోట్ల రూపాయాల్లో తీవ్రనష్టం వాటిల్లింది. దీంతో ఇప్పుడు చెన్నైలోని పలు ఐటీ కంపెనీలు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రధాన సర్వర్ల నుంచి కంప్యూటర్ల వరకూ నీట మునిగి దాదాపు నెల రోజుల పాటు ఎటువంటి కార్యకలాపాలూ జరగని పరిస్థితిని అనుభవిస్తున్న ప్రముఖ కంపెనీలు, మరోసారి ఇటువంటి పరిస్థితి రాకముందే జాగ్రత్త పడాలన్న భావనతో, తిరుపతి వైపు చూస్తున్నాయని సమాచారం. ఇప్పటికే టీసీఎస్, హెచ్సీఎల్ సంస్థలు తిరుపతి సమీపంలో తమ శాఖలు ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక వసతుల కోసం చూస్తున్నాయి. చెన్నైలోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వారిలో 30 శాతం మంది వరకూ తిరుపతి చుట్టుపక్కల వారే కావడంతో తిరుపతిలో శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తిరుపతిలో శాఖలు ఏర్పాటు చేసి, ఆపై ఉద్యోగుల స్పందన బట్టి పూర్తిగా తరలిరావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చెన్నైతో పోలిస్తే, తిరుపతి సమీపంలో ప్రకృతి వైపరీత్యాల బెడద ఉండదు కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఐటీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారీ వర్షాలు, వరదలు కారణంగా చెన్నైలో కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ కంపెనీలు 6 కోట్ల డాలర్ల మేర నష్టపోవాల్సి వచ్చిందని ఐటీ పరిశ్రమ వర్గాలంటున్నాయి. మన కరెన్సీలో ఈ మొత్తం రూ. 400 కోట్లకు సమానం. ఇందులో మిడ్ సైజ్ ఐటీ కంపెనీలు 50 లక్షల నుంచి కోటి డాలర్ల మేర ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని, బడా సంస్థలకు 4-5 కోట్ల డాలర్ల మేర గండిపడిందని వారు అంచనా వేస్తున్నారు. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్‌తోపాటు ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ చెన్నైలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వరదలు కారణంగా ఈ సంస్థలు తమ సిబ్బందిని బస్సుల ద్వారా బెంగళూరులోని కార్యాలయాల్లో పనిచేసేందుకు పంపించిన సంగతి తెలిసిందే. వరద సమయంలో సంస్థల మానవ వనరుల విభాగం ఉద్యోగులందికీ ఫోన్లు చేసి పరిస్థితిని సైతం తెలుసుకున్నాయి. వరదలకు టీసీఎస్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడటం టీసీఎస్ యాజమాన్యాన్ని కదిలించి వేసింది. పలువురి ఉద్యోగుల ఇళ్లలోని సామాన్లు పాడైపోవడం, వాహనాలు, ఆస్తులు ధ్వంసం కావడంతో అలాంటి వారిని ఆదుకునేందుకు రూ. 1,100 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు వడ్డీ రహిత క్యాష్ అడ్వాన్సుల రూపంలో ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఒక్కో ఉద్యోగి కనీసం రూ. లక్ష నుంచి గరిష్ఠంగా మూడు నెలల స్థూల వేతనం వరకూ అడ్వాన్స్ పొందవచ్చని సంస్థ ఉద్యోగులకు ఇంటర్నెల్ కమ్యూనికేషన్ పోర్టల్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వరదల కారణంగా చెన్నైలోని పరిశ్రమలు, వ్యాపార సంస్థలు రూ.15 వేల కోట్ల మేర నష్టపోయి ఉంటాయని వాణిజ్య మండలి అసోచామ్ అంచనా వేస్తున్నది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com