డేగ కన్నుతో వాట్సాప్‌ న్యూ ఫీచర్

- July 11, 2018 , by Maagulf
డేగ కన్నుతో వాట్సాప్‌ న్యూ ఫీచర్

ప్రసార సాధనాల్లో ఒకటైన వాట్సాప్‌లో అనేక రకాలై నకిలీ సందేశాలు (ఫేక్ మెసేజెస్)లు షేర్ అవుతుంటాయి. వీటిని అరికట్టాలని కేంద్రం గట్టిగా హెచ్చరించింది. దీంతో రంగంలోకి దిగిన వాట్సాప్ యాజమాన్యం... సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా మెసేజ్‌ను స్వయంగా పంపిన వారే రాశారా? లేక ఎవరో పంపిన దానిని ఫార్వర్డ్‌ చేశారా? అనేది సులభంగా తెలుసుకోవచ్చు.
వాట్సాప్‌ యాప్‌ లేటెస్ట్ అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు ఒక మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసే ముందు అది ఎంతవరకు నిజమో నిర్ధారించుకోవాలని కోరింది. ఇలా చేయడం వల్ల పుకార్లు మరింతగా విస్తృతం కాకుండా ఉండేందుకు ఈ కొత్త ఫీచర్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంది.
నిజానికి ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో అనేక తప్పుడు సందేశాలు విస్తృతంగా వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. దీంతో అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి కూడా. ఈ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది.
ఫేక్ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి?
* వాట్సాప్‌కు వచ్చే ప్రతి సందేశాన్ని నమ్మకూడదు. ఉదాహరణకు.. ఎక్కడో నారింజ చెట్టుకు మామిడి కాయలు కాస్తున్నాయంటూ మెసేజ్ వస్తే.. దాన్ని గుడ్డిగా నమ్మేసి ఇతరులకు షేర్ చేయకూడదు.
* కోపం తెప్పించే మెసేజ్‌లపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రిప్లైకి ముందుగా ఆ వార్తల్లో నిజమెంతో నిర్ధారించుకోవాలి.
* వైరల్‌ అయ్యేందుకు క్రియేట్ చేసిన మెసేజ్, పుకార్లు, వినియోగదారుల సానుభూతి పొందే తరహాలో రూపుదిద్దుకుంటాయి. వాటిలో స్మైలీలు ఎక్కువగా ఉండొచ్చు. 1-2 ఫొటోలూ ఉండొచ్చు. అలాంటి మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలి.
* మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు వాట్సప్‌లో తరచుగా వైరల్‌ అవుతుంటాయి. సో.. ఫొటోలను జాగ్రత్తగా పరిశీలించాలి.
* ఫోటోల తరహాలోనే లింక్‌లనూ కొందరు మార్చేస్తుంటారు. అధికారిక వెబ్‌సైట్‌కు చెందిన వాటిగా భ్రమ కల్పిస్తారు. ఇలాంటివాటితో జాగ్రత్తగా ఉండాలి.
* వాట్సప్‌లోనే సమాచారాన్నంతటినీ తెలుసుకోవద్దు. వచ్చిన సందేశాల్లో నిజానిజాలను నిర్ధారించుకునేందుకు వార్తాపత్రికలు చదవాలి. లేదంటే టీవీల ద్వారా వార్తలు తెలుసుకోవాలి.
* ఏదైనా సమాచారం, మెసేజ్ నమ్మదగినట్లు లేకపోతే వాటిని ఇతరులకు షేర్ చేయరాదు.
* తరచుగా పుకార్లు, ఫేక్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నవారిని బ్లాక్‌ చేయండి.
* ప్రజల మనోభావాలను ప్రభావితం చేసేలా ఉన్న సందేశాలు తరచుగా వైరల్‌ అవుతుంటాయి. పుకార్లను ఆ తరహాలోనే క్రియేట్ చేస్తారు. ఇలా వైరల్ అయ్యే సందేశాలపై మరింత అప్రమత్తతగా మెలగాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com