ఇండియాతో ప్రతి మ్యాచ్‌ ముఖ్యమైనదే:సర్ఫరాజ్‌ అహ్మద్‌

- September 11, 2018 , by Maagulf
ఇండియాతో ప్రతి మ్యాచ్‌ ముఖ్యమైనదే:సర్ఫరాజ్‌ అహ్మద్‌

దుబాయ్‌:భారత్‌తో మ్యాచ్‌ అంటే ఎలాంటి ప్రత్యేకత లేదు.. మిగతా దేశాలతో ఆడినట్లే భారత్‌తోనూ ఆడతాం అని కొద్ది రోజుల క్రితం పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ అన్నాడు. తాజాగా భారత్‌తో ఆడే ప్రతి మ్యాచ్‌ తమకు ఎంతో ముఖ్యమైనదే అని అంటున్నాడు పాక్‌ క్రికెట్‌ జట్టు సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌. మరికొద్ది రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ టోర్నీ ప్రారంభంకానుంది.

ఈ నేపథ్యంలో సర్ఫరాజ్‌ మీడియాతో మాట్లాడుతూ... 'భారత్‌తో ఆడే ప్రతి మ్యాచ్‌ మాకు ఎంతో ముఖ్యమైనదే. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ టోర్నీని గెలుపుతో ఆరంభించాలనుకుంటున్నాం. హాంకాంగ్‌తో తొలి మ్యాచ్‌ ఆడబోతున్నాం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రెట్టించిన ఉత్సాహంతో భారత్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమౌతాం. భారత్‌తో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ ఆడి ఏడాదిన్నర గడిచింది. ప్రస్తుతం ఆ మ్యాచ్‌ గురించి మేము ఆలోచించడంలేదు. అదంతా గతం. ప్రొఫెషనల్‌ జట్టు ఏదైనా గతాన్ని మరిచిపోయి భవిష్యత్తు గురించే ఆలోచిస్తోంది. భారత్‌, పాక్‌ జట్లు కూడా అంతే. ఆసియా కప్‌లో పాల్గొనే అన్ని జట్లను చూశాను. ప్రతి జట్టు ఎంతో బలంగా ఉంది. ఏ ఒక్క జట్టును తేలిగ్గా తీసుకోలేం. ఈ టోర్నీలో అన్ని జట్లు మంచి క్రికెట్‌ ఆడతాయని ఆశిస్తున్నా' సర్ఫరాజ్‌ అన్నాడు.

ఈ నెల 15 నుంచి ఆసియా కప్‌ టోర్నీ ప్రారంభంకానుంది. గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్థాన్‌, హాంకాంగ్‌ జట్లు ఉన్నాయి. పాక్‌-హాంకాంగ్‌ జట్లు 16న తలపడతాయి. 18న భారత్‌-హాంకాంగ్‌, 19న భారత్‌-పాక్‌ తలపడనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com