బీఎస్‌ఎన్‌ఎల్ భారీ డిస్కాంట్‌..

- December 20, 2015 , by Maagulf
బీఎస్‌ఎన్‌ఎల్ భారీ డిస్కాంట్‌..

ప్రభుత్వ రంగ మొబైల్ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త వినియోగదారులకు కాల్ రేట్లలో భారీ డిస్కాంట్‌ను ఆఫర్ చేస్తోంది. కంపెనీ మౌలిక సదుపాయాలను పునర్వ్యస్థీకరించామని, కొత్త వినియోగదారులకు మొబైల్ కాల్ రేట్లలో 80 శాతం వరకూ డిస్కౌంట్‌నిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ చెప్పారు. కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు మొదటి రెండు నెలల్లో కాల్ రేట్లలో 80 శాతం వరకూ డిస్కౌంట్‌నిస్తామని, నిమిషాల, సెకన్ల బిల్లింగ్ ప్లాన్‌లకు ఇది వర్తిస్తుందని వివరించారు. రూ.36 ప్లాన్ ఓచర్(సెకన్ బిల్లింగ్), రూ.37 ప్లాన్ ఓచర్(నిమిషాల బిల్లింగ్)లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. రూ.37 ప్లాన్ ఓచర్‌లో బీఎస్‌ఎన్‌ల్ నెట్‌వర్క్‌లో లోకల్, ఎస్‌టీడీ కాల్స్‌కు నిమిషానికి 10 పైసలు చార్జ్ చేస్తామని చెప్పారు. ఇతర నెట్‌వర్క్‌లకైతే ఈ చార్జీ నిమిషానికి 30 పైసలు ఉంటుందని తెలిపారు. ఇక రూ.36 ప్లాన్ ఓచర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లో లోకల్, ఎస్‌టీడీ కాల్స్‌కు ప్రతి మూడు సెకన్లకు 1 పైసా వంతున చార్జ్ చేస్తామని, ఇతర నెట్‌వర్క్‌లకైతే ప్రతి3 సెకన్లకు 2 పైసలు చొప్పున చార్జీ ఉంటుందని వివరించారు. వినియోగదారుల సేవల కోసం ఏజీస్ బీపీవోతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఇక ఈ ఏడాది జూలై-నవంబర్ కాలానికి మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్‌పీ) కింద 1,24,158 మంది తమ నెట్‌వర్క్ నుంచి వెళ్లిపోగా, 1,57,564 మంది ఇతర నెట్‌వర్క్‌ల నుంచి తమ నెట్‌వర్క్‌లోకి వచ్చారని పేర్కొన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సంఖ్య 7.96 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌లో కొత్తగా చేరిన మొబైల్ వినియోగదారుల విషయంలో టాప్ ఫైవ్ కంపెనీల్లో ఒకటిగా బీఎస్‌ఎన్‌ఎల్ నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com