‘ఇంటర్’ తరువాత ఈ కోర్సు చేస్తే మీరే మేనేజర్లు..

- April 03, 2019 , by Maagulf
‘ఇంటర్’ తరువాత ఈ కోర్సు చేస్తే మీరే మేనేజర్లు..

చదివిన చదువుకి ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలనుకుంటే అక్కడే ఉంటారు. ఎదగడానికి ప్రయత్నించాలి. మీమీ రంగంలో మీరే బాస్ ఎందుక్కాకూడదు. ప్రయత్నిస్తే సాధించలేనిదేముంది. అందుకోసం ఓ ప్రణాళిక ప్రకారం చదువుకుంటే లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు. మీరే మేనేజర్ కావచ్చు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో మేనేజర్లకు మంచి జీతాలతో పాటు కొన్ని అదనపు సౌకర్యాలు కూడా ఉంటాయి.
 
అలాంటి ఉన్నతమైన జీవితాన్ని అందుకోవాలంటే ఇంటర్ నుంచే లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. ఇందుకోసం బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కామర్స్ చదివినవారే మేనేజ్‌మెంట్ కోర్సులను ఎంచుకోవాలన్న నిబంధన ఏమీ లేదు. ఏ గ్రూప్ తీసుకున్న వారైనా ఈ కోర్సు చేయవచ్చు.

డిగ్రీ స్థాయిలో బీబీఏ (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), బీఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్), బీబీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్), బీబీఎం (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సులున్నాయి. 
బోధించే అంశాలు.. మేనేజ్‌మెంట్ విద్య గురించిన ప్రాథమిక అవగాహన, కేస్ స్టడీలు, ప్రాజెక్టులు, ప్రెజంటషన్లు, పరిశ్రమల సందర్శన, నిపుణులతో సంభాషించడం వంటివన్నీ కోర్సులో వివరిస్తారు.

కోర్సు కాలవ్యవధి.. మూడేళ్లు.
ప్రవేశం పొందాలంటే.. ఇంటర్‌లో 50% మార్కులు ఉండాలి. ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ చదివి వుండాలి. ఆ్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా 60 సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. మరికొన్ని ప్రముఖ సంస్థలు, విశ్వవిద్యాలయాలు మాత్రం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారికి ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్షలను మే, జూన్ నెలలో నిర్వహిస్తారు.

కొన్ని ప్రముఖ సంస్థలు..
సింబయాసిస్ యూనివర్సిటీ (సెట్) పుణె
దిల్లీ యూనివర్సిటీ (డీయూజేఏటీ)
షాహీద్ సుఖ్‌దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ (డీయూ-జేఏటీ)
నర్సీ మాంఝీ – ముంబయి (ఎన్‌పీఏటీ)
క్రైస్ట్ యూనివర్సిటీ – బెంగళూరు (సీయూఈటీ)
మణిపాల్ యూనివర్సిటీ (ఎంయూ-ఎంఈటీ)
సెయింట్ జేవియర్- ముంబయి
ఎంఎస్‌యూ – బరోడా
జీజీఎస్- ఐపీ యూనివర్సిటీ, దిల్లీ (సీఈటీ- ఐపీ)

మరి కొన్ని సంస్థలు డిగ్రీ, పీజీలను కలిపి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిల్లో ప్రవేశానికి ఇంటర్ ఏగ్రూపు వారైనా అర్హులే. కానీ ఇంటర్‌లో 70% మార్కులు వచ్చి ఉండాలి. గీతం, కళింగ, ఐటీఎం, ఏటీఎం గ్లోబల్ బిజినెస్ స్కూల్, న్యూదిల్లీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అలియన్స్ యూనివర్సిటీ, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ వంటి కొన్ని సంస్థలు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నాయి.

మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టా అందుకున్నవారికి వివిధ రంగాలు- సేల్స్‌, ఫైనాన్స్‌, అకౌంటింగ్‌, మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, ట్రేడింగ్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌.. ఇలా ఎన్నో రంగాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. సొంత వ్యాపారం చేయాలనుకునేవారికీ అనుకూలం. నాయకత్వ లక్షణాలు, ప్రెజెంటేషన్‌ నైపుణ్యాలు, నలుగురిలో మాట్లాడేతత్వం వంటివి అలవడతాయి. మంచి నైపుణ్యాలున్నవారికి మంచి వేతనాలుంటాయి. అనుభవం పెరిగే కొద్దీ వేతనం పెరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com