తెలంగాణాలో భానుడి భగభగలు

- April 27, 2019 , by Maagulf
తెలంగాణాలో భానుడి భగభగలు

తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఉత్తర భారతం నుంచి పొడిగాలులు వీస్తుండటంతో తెలంగాణలో వడగాడ్పులు వీస్తున్నాయి. మరోవైపు గ్రేటర్‌ను కూడా మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. ఈనెల 28, 29 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు తీవ్రంగా వీచే ప్రమాదం పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ‘గ్రేటర్‌’ నగరంపైనా వడగాల్పులు పంజా విసురుతాయని స్పష్టం చేసింది. పగటి వేళల్లో వీచే వేడి గాలులు తీవ్ర స్థాయిలో ఉంటాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా గాలిలో తేమ 43 శాతం కంటే తగ్గడంతో వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని పేర్కొంది.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి.శక్రవారం నిజామాబాద్‌ జిల్లా కోరట్‌పల్లి,మంచిప్పలో 45.5,మోర్తాడ్‌లో 45.3,లక్ష్మాపూర్‌,అదిలాబాద్‌ జిల్లా బేల,జైనథ్‌లో 45.4,నిజామాబాద్‌లో 44.7 ,రామగుండంలో 44.0,అదిలాబాద్‌లో 43.8,హైదరాబాద్‌లో 41.2 డిగ్రీల మేర అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మున్ముందు ఇంకా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

శుక్రవారం నగరంలో 41 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవడంతో మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వడగాడ్పులు, అధిక ఎండల నేపథ్యంలో పగటి వేళ ఇంటి నుంచి బయటికి వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. పగటి వేళల్లో వృద్ధులు, రోగులు, చిన్నారులు అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి వెళ్లాలని పేర్కొంది. కాగా ఇటీవల హైదరాబాద్‌ గాలిలో తేమ శాతం 50 శాతానికి పైగా నమోదైందని, అందుకే మధ్యాహ్నం గాలుల్లో వేడి తీవ్రత అంతగా లేదని వాతావరణ శాఖ తెలిపింది.. వచ్చే ఆది, సోమవారాల్లో వేడిగాలులు తీవ్రంగా వీచే అవకాశాలున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com