భద్రతా బలగాల ఉగ్రవేట.. 15 మంది హతం

- April 28, 2019 , by Maagulf
భద్రతా బలగాల ఉగ్రవేట.. 15 మంది హతం

శ్రీలంకలో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. తాజాగా భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో 15 మంది మృతి చెందారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీలంక సర్కారు చెబుతోంది. మరోవైపు బాంబు పేలుళ్లపై నిర్లక్ష్యం వహించినందుకు మరో అధికారిపై వేటు పడింది.

ఈస్టర్ వేడుకల్లో బాంబు పేలుళ్లతో అప్రమత్తమైన శ్రీలంక సర్కారు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. పలు చోట్ల బాంబులను వెలికితీస్తూ, వాటిని నిర్వీర్యం చేస్తోంది. మరిన్ని ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో అనుమానమున్న ప్రతి చోట సోదాలు నిర్వహిస్తోంది. కమ్మునాయి పట్టణంలో ఓ ఇంట్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో సైనిక బలగాలు ఆ ఇంటిని రౌండప్ చేశాయి. దీంతో భద్రతా దళాలు, టెర్రరిస్టుల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇక, కల్ముని ప్రాంతంలో సైన్యం, తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. అయితే ముగ్గురు సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చేసుకున్నారు. మరో అనుమానిత సూసైడ్ బాంబర్‌ను పోలీసులు కాల్చి చంపారు. మ‌రో ముగ్గురు గాయాల‌తో పరారయ్యారు. పారిపోయిన తీవ్రవాదుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మరోవైపు శ్రీలంకలో ఉగ్రదాడిని నిలువరించడంలో విఫలమైనందుకు మరో అధికారిపై వేటు పడింది. ఉగ్రదాడిపై నిఘావర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహ రించారంటూ శ్రీలంక ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ పుజిత్‌ జయసుందర తన పదవి నుంచి తప్పుకున్నారు. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశాలతో రక్షణ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో ఇప్పటికే రాజీనామా చేయగా, తాజాగా ఐజీపీ జయసుందర బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

కొలొంబోలో నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌ చీఫ్‌ జహ్రాన్‌ హషీమ్‌ నేతృత్వంలో ఆత్మాహుతి దాడులు జరిగాయని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐసిస్‌కు ఎన్‌టీజే విధేయత ప్రకటించిందంటున్నాయి. ఈస్టర్‌ రోజున షాంగ్రీలా హోటల్‌పై ఇల్హమ్‌ అహ్మద్‌ ఇబ్రహీం అనే సూసైడ్‌ బాంబర్‌తోపాటు జహ్రాన్‌ హషీమ్‌ కూడా దాడి చేశాడని సమాచారం. దాడిలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com