పాకిస్థాన్‌లో భారతీయుడి దాతృత్వం

- June 06, 2019 , by Maagulf
పాకిస్థాన్‌లో భారతీయుడి దాతృత్వం

దాయాది దేశం పాకిస్థాన్‌లో పేదరికంతో అల్లాడిపోతున్న ప్రజలను చూసి చలించిపోయాడో భారతీయుడు. వారి దాహార్తిని తీర్చేందుకు తనవంతు సాయంగా చేతిపంపులు ఏర్పాటుచేసి దాతృత్వాన్ని చాటుకున్నాడు. అతడే జోగిందర్‌ సింగ్‌ సలారియా.

భారత్‌కు చెందిన జోగిందర్‌ 1993లోనే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. ఓ వైపు ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తూనే పెహల్‌ పేరుతో ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను నడుపుతున్నారు. ఇటీవల ఆయన పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో గల థార్‌పార్కర్‌ జిల్లాలో 62 చేతిపంపులు ఏర్పాటు చేయించారు. ఈ జిల్లాలో నీటి ఎద్దటి విపరీతంగా ఉంటోంది. వ్యవసాయానికి వర్షపు నీరే ఆధారం. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.

థార్‌పార్కర్‌ గురించి సోషల్‌మీడియా ద్వారా తెలుసుకున్న జోగిందర్‌ అక్కడి ప్రజల పరిస్థితిని చూసి చలించిపోయారు. ఎలాగైనా వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌మీడియా సైట్ల ద్వారా పాకిస్థాన్‌లోని సామాజిక కార్యకర్తలను సంప్రదించి.. జిల్లాలో చేతిపంపులు ఏర్పాటు చేయించారు. అంతేగాక.. అక్కడి వారి కోసం పప్పుధాన్యాలు కూడా పంపించారు.

పుల్వామా దాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే తాము చేతిపంపులు ఏర్పాటుచేసినట్లు జోగిందర్‌ తెలిపారు. విస్తీర్ణం పరంగా సింధ్‌ ప్రావిన్స్‌లోని అతిపెద్ద జిల్లా అయిన థార్‌పార్కర్‌ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. ఇక్కడ నివసించేవారిలో దాదాపు 87శాతం మంది పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నవారే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com