కుమారస్వామి స్టెప్పులేంటి?

- July 13, 2019 , by Maagulf
కుమారస్వామి స్టెప్పులేంటి?

పక్కలో బల్లెంలా మారిన బీజేపీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు సీఎం కుమారస్వామి. అవిశ్వాస పరీక్షను తెరమీదకు తీసుకొచ్చారు. ఉంటుందో.. ఊడుతుందో తెలీని గందరగోళ స్థితిలో కుమారస్వామి డేరింగ్ నిర్ణయం వెనుక లెక్కేంటి?

కాంగ్రెస్ మద్దతుతో సీఎం కుర్చి ఎక్కిన కుమారస్వామికి దిన దిన గండంలానే గడిచింది. తొలిరోజుల్లో కాంగ్రెస్ పోటును భరించలేక కన్నీరు పెట్టుకునే పరిస్థితి దిగజారారు కుమారస్వామి. ఓకానొక సమయంలో ఇక నా వల్ల కాదు అంటూ కాడెత్తేసే స్థితికి చేరుకున్నారు. అది కాంగ్రెస్ వ్యూహమా? కుమారస్వామికి కలిసిరాని కాలమా అనేది ఎలా ఉన్నా..ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత లేదు. అయితే..సంక్షోభ సమయంలో మాత్రం విభేదాలను పక్కనబెట్టి ఒకరికొకరం అంటూ కలరింగ్ ఇస్తూ వస్తున్నాయి.

కూటమి కుంపట్లతో వేగుతూ వస్తున్న కుమారస్వామికి బీజేపీ గండాలు సృష్టిస్తూ వస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని ఇప్పుడు రాజకీయాన్ని రసవత్తరంగా మార్చింది బీజేపీ. ఏకంగా 14 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంది. దీంతో కూటమి ప్రభుత్వానికి గండికొట్టే స్కెచ్ తో పొలిటికల్ షో చూపిస్తోంది. అయితే..అపత్కాల సమయంలో అనూహ్య నిర్ణయంతో బీజేపీకి షాక్ ఇచ్చారు కుమారస్వామి. తాను అవిశ్వాసానికి వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు. డేటు టైం ఫిక్స్ చేయాలని కోరారు. అటు స్పీకర్ హెచ్ ఆర్ రమేష్ కూడా అవిశ్వాస పరీక్షలో బలాబలాలు తేల్చేందుకు తాను కూడా సిద్ధం అంటూ ప్రకటించారు.

కూమారస్వామి డేరింగ్ డిసిషన్ తో బీజేపీ డిఫెన్స్ లో పడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు 224 మంది ఉన్నారు. ఇందులో ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది అవసరం ఉంటుంది. 14 మంది జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు టర్న్ తీసుకున్నారు. ఇందులో 11 మంది స్పీకర్ కు రాజీనామా అందించారు. ఈ పదకొండు మంది రాజీనామాలను ఆమోదిస్తే సభలో సభ్యుల సంఖ్య 213కి పడిపోతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 107కు తగ్గుతుంది. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు 105 మంది ఉన్నారు. బీఎస్పీ ఎమ్మెల్యేతో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతుగా ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు బీజేపీకి లైన్ క్లియర్ అవుతుందన్నది బీజేపీ ప్లాన్.

అందుకే ఆ 11 మంది ఎమ్మెల్యే రాజీనామాలపై స్పీకర్ ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారు. అదే సమయంలో రాజీనామాలు ఆమోదంచకంటే వారిపై అనర్హత వేటు వేసి గండం నుంచి గట్టెక్కే ఆలోచనలో ఉంది. అయితే..రాజీనామాల ఎపిసోడ్ లో సుప్రీం ఎంట్రీ తర్వాత ఇక అవిశ్వాస అస్త్రాన్ని సంధించారు కుమారస్వామి. బలపరీక్ష ఎదుర్కునే సమయంలో కాంగ్రెస్- జేడీఎస్ తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేస్తుంది. దీంతో రాజీనామాలు ఇచ్చిన ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ సింబల్ మీద గెలిస్తే ఆ పార్టీకే ఓటు వేయాల్సి ఉంటుంది. లేదంటే అనర్హత వేటు తప్పదు. ఒక వేళ అనర్హతకు కూడా సిద్ధపడి బీజేపీకి ఓటు వేసినా..రెబెల్స్ లో ఓ ఐదారుగుర్ని మేనేజ్ చేయగలిగితే చాలు బీజేపీ ఆశలకు గండి పడుతుంది. ఇదే ధైర్యంతో ప్రతిపక్షం డిమాండ్ చేయకముందే బల పరీక్షకు సిద్ధమవుతున్నారు కుమారస్వామి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com