కొత్తగా ఇళ్లు కొనుగోలుచేసేవారికి 5-7 శాతం తగ్గుతాయ్!

- January 07, 2016 , by Maagulf
కొత్తగా ఇళ్లు కొనుగోలుచేసేవారికి 5-7 శాతం తగ్గుతాయ్!

కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న కష్టాలకు ప్రభుత్వం స్వస్తి చెప్పింది. స్థిరాస్తి రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, నిబంధనల సడలింపులపై నిర్మాణ రంగంలోని పలు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా క్రెడాయ్, ట్రెడా, టీడీఏ, టీబీఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో గురువారమిక్కడ 'ప్రభుత్వ పాలసీలు: తెలంగాణలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి అవకాశాలు- సవాళ్లు' అనే అంశంపై సదస్సు జరిగింది.ఈ సందర్భంగా భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ ఎస్ రాంరెడ్డి మాట్లాడుతూ.. ''గతంలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే రెండేళ్లయినా ఫైలు ముందుకు కదిలిదే కాదు. కానీ, ఇప్పుడు 15-20 రోజుల్లోనే అనుమతులను మంజూరు చేస్తామని ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో ప్రాజెక్ట్ వ్యయం 10-15 శాతం మేర తగ్గుతుందని.. అయితే ఈ తగ్గింపు కొత్తగా ఇళ్లు కొనుగోలుచేసేవారికి 5-7 శాతం వరకే ఉంటుందని'' వివరించారు. ఎందుకంటే స్థలం ధరలు, బ్యాంకుల వడ్డీలు, ఇతరత్రా నిర్మాణ సామాగ్రి ధరలు రోజురోజుకూ పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.అనంతరం తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ప్రెసిడెంట్ దశరథ్ రెడ్డి మాట్లాడుతూ.. స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న 44 కీలక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే అందులో 23 సమస్యలను మాత్రమే పరిష్కరించారని.. మిగతా వాటిపై కమిటీని వేసి 3 నెలల్లో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల నిర్మాణ రంగంలో పారదర్శకత నెలకొంటుందని.. ఇదే సమయంలో కొనుగోలుదారులూ జాగురూకత వహించాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com