కుందేలు ఉపాయం..

- May 16, 2015 , by Maagulf
కుందేలు ఉపాయం..

ఒక అడవిలో ఒక సరస్సు ఉండేది. దాని మధ్యలో చిన్న దీవి ఉండేది. ఆ దీవిలో రకరకాల పండ్ల చెట్లు ఉండేవి. ఆ పండ్లను తినాలని చాలా జంతువులకు ఆశగా ఉందేదిగానీ అక్కడకు వెళ్ళడానికి సాహసించేవికాదు. ఎందుకంటే ఆ సరస్సు నిండా మొసళ్ళు ఉండేవి. ఒకరోజు దాహం తీర్చుకోడానికి సరస్సు దగ్గరకు వచ్చిన కుందేలుకు దీవిలోని పండ్లను చూసి నోరూరింది. ఎలాగైనాసరే ఒక్కసారి అక్కడకు వెళ్లి కడుపునిండా పండ్లు తినాలనే కోరిక కలిగింది. ఆ రాత్రంతా బాగా ఆలోచిస్తే దానికో ఉపాయం తట్టింది. మర్నాడు ఉదయాన్నే సరస్సు దగ్గరకు వెళ్లి మొసళ్ళను ఒడ్డుకు రమ్మంటూ కేకలు పెట్టింది. 'మమ్మల్ని బయటకు రమ్మనే ధైర్యం ఎవరికుందబ్బా' అనుకుంటూ అవి బయటకు వచ్చాయి. 'మీకో శుభవార్త చెబుదామని పరుగెత్తుకుంటూ ఇలా వచ్చాను. మన మృగరాజుగారు అడవిలోని జంతువులన్నింటికీ విందు భోజనం ఎర్పాటు చేసి బహుమతులు కూడా ఇవ్వాలనుకుంటున్నారు. అందుకని మిమ్మల్ని లెక్కపెట్టే పని నాకు అప్పగించారు. మీరు నన్ను ఏమీ చేయకుండా ఉంటే లెక్కపెట్టి రాజుగారికి విన్నవిస్తాను' అంది ఎంతో వినయంగా. 'మమ్మల్ని నువ్వెలా లెక్కపెడతావ్' అని అనుమానంగా అడిగిందో మొసలి. 'మీరందరూ ఒక వరుసగా ఉంటే లెక్కపెట్టేస్తాను' అంది కుందేలు. అది చెప్పినట్టుగానే చేశాయి మొసళ్ళు. వాటి వరుస సరస్సు ఒడ్డు నుంచి దీవి వరకూ ఉంది. కుందేలు వాటి మీద నుంచి దీవికి చేరుకొని చక్కగా కడుపు నిండా పండ్లూ దుంపలూ తిని వచ్చింది. 'ఎప్పుడో వెళ్లినదానివి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావ్?' అంటూ గట్టిగా అరిచిందో మొసలి. మీరెందరు ఉన్నారో లెక్క ఖచ్చితంగా తేలక అవస్థ పడుతున్నాను. 'ఒక్కసారి మళ్ళీ నిలబడితే ఈసారి సరిగ్గా లెక్కపెడతాను' అంది కుందేలు. దాని మాట ప్రకారం మళ్ళీ వరుసగా నిలబడ్డాయి మొసళ్ళు. తన ఉపాయంతో కడుపు నిండుగా పండ్లూ దుంపలూ తిన్న కుందేలు వాటి మీద నుంచి చెంగు చెంగున దూకుతూ సరస్సు నుంచి బయటపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com