హస్తినలో అలీ..బీజేపీ తీర్ధం పుచ్చుకుంటాడా?

- January 24, 2020 , by Maagulf
హస్తినలో అలీ..బీజేపీ తీర్ధం పుచ్చుకుంటాడా?

చంద్రబాబు ప్రభుత్వం చివరి రోజులవీ.. ఎన్నికల వేళ ప్రతిపక్ష వైసీపీకి అండగా కదిలివచ్చారు కొందరు సినీ ప్రముఖులు. టాలీవుడ్ పెద్దలంతా చంద్రబాబు వెంట ఉంటే.. ఫృథ్వీ, అలీ, జీవిత రాజశేఖర్, పోసాని లాంటి కొందరు మాత్రం జగన్ సీఎం కావాలని పాటుపడి ఆయన కోసం ప్రచారం కూడా చేశారు.

ఇక కమెడియన్ అలీ ఎన్నికలకు నెల రోజుల ముందు జగన్ కు జై కొట్టారు. ఎవరు మంత్రి పదవి ఇస్తే వారి పార్టీలోనే చేరుతానని ప్రకటించి పార్టీల గడప తొక్కిన అలీ చివరకు చంద్రబాబును కాదని.. జగన్ ను కలిసి వైసీపీలో చేరారు.

అలీ ఎమ్మెల్యే టికెట్ హామీపైనే వైసీపీలో చేరినా.. లాస్ట్ మినట్ లో జగన్ ఇవ్వలేకపోయారు. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ పోస్టులపై జగన్ దృష్టిసారించారు. కమెడియన్ పృథ్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం టీవీ (ఎస్వీబీసీ) చానెల్ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ పదవిని మరో సినీ నటుడికి ఇచ్చారు. కానీ జగన్ కు చివరి నిమిషంలో జైకొట్టిన అలీకి జగన్ గద్దెనెక్కి 7 నెలలు అవుతున్నా ఇంతవరకూ పదవి దక్కలేదు.

ఈ నేపథ్యంలో అలీ ఢిల్లీ బాట పట్టారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ కార్యాలయంలో అలీ ప్రత్యక్షం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యక్తిగత విషయమై బీజేపీ కార్యాలయానికి వెళ్లినట్టు అలీ చెబుతున్నా నమ్మశక్యంగా అనిపించడం లేదని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. అలీ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com