కరోనా ఎఫెక్ట్: తొలిసారిగా భక్తులు లేకుండానే భదాద్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం

- April 02, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్: తొలిసారిగా భక్తులు లేకుండానే భదాద్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం

భద్రాచలం: భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీ  సీతారామ చంద్రస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి కరోనా దెబ్బ పడింది. ఈ కళ్యాణోత్సవం కార్యక్రమానికి భక్తులు రాకూడదని ప్రభుత్వం కోరింది.

ఈ కళ్యాణోత్సవంలో ఎంపిక చేసిన 40 నుండి 60 మంది మాత్రమే  హాజరయ్యారు. భక్తులు లేకుండా తొలిసారిగా భదాద్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారి అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ప్రతి ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాచలం ఆలయంలో శ్రీసీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యేవారు.  ఈ కార్యక్రమానికి హాజరుకాలేని వారు టీవీల్లో ఈ కళ్యాణోత్సవాన్ని చూసి తరించేవారు.

కరోనా ఎఫెక్ట్‌ను పురస్కరించుకొని గురువారం నాడు భదాద్రిలో నిర్వహించే స్వామివారి కళ్యాణోత్సవానికి భక్తులు ఎవరూ రాకూడదని ప్రభుత్వం కోరింది.  స్వామి వారి కళ్యాణం నిర్వహించే అర్చకులు, దేవాలయ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులకు మాత్రమే కళ్యాణోత్సవ కార్యక్రమానికి అనుమతిని ఇచ్చారు.

ఈ కళ్యాణోత్సవానికి అనుమతి లభించిన వారి సంఖ్య 40 నుండి 60 మంది మాత్రమే. గురువారం నాడు ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు.

నిత్యకళ్యాణ వేదిక వద్దే స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1964కు ముందు స్వామివారి కళ్యాణాన్ని దేవాలయ ఆవరణలో నిర్వహించేవారు.  1965 తర్వాత దేవాలయానికి వెలుపల  ఉన్న మిథిలా స్టేడియంలో కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. 

ఈ కళ్యాణోత్సవ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులతో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  దంపతులు, తెలంగాణ రాష్ట్ర సలహాదారు రమణాచారి కూడ పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com