ధోని పై ధ్వజమెత్తిన శ్రీకాంత్

- October 20, 2020 , by Maagulf
ధోని పై ధ్వజమెత్తిన శ్రీకాంత్

యువ ఆటగాళ్ల ఎంపికపై చెన్నై కెప్టెన్‌ ధోనీ చేసిన వ్యాఖ్యలను భారత జట్టు మాజీ సారథి కృష్ణమాచార్య శ్రీకాంత్‌ కొట్టిపారేశాడు. జట్టులో ఆటగాళ్ల ఎంపిక తీరుపై ఆయన‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. యువఆటగాళ్లలో కనిపించని కసి ఫామ్‌లో లేని కేదార్ జాదవ్‌లో కనిపించిందా అని ఎద్దేవా చేశాడు. ఈ విషయంలో ధోనీ వ్యాఖ్యలను తాను సమర్థించబోనని స్పష్టం చేశాడు. 

సోమవారం రాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ధోనీ మాట్లాడాడు. ‘మా జట్టులోని కొంతమంది యువ ఆటగాళ్లలో ఆడాలన్న కసి కనిపించలేదు. అందుకే వాళ్లకు జట్టులో స్థానం కల్పించలేదు. లీగ్‌లో మిగిలిన మ్యాచుల్లో వాళ్లకు అవకాశం ఇస్తాం. ఒత్తిడి లేకుండా వాళ్లు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు’ అని పేర్కొన్నాడు. 

దీనిపై స్పందించిన శ్రీకాంత్‌.. ‘ధోనీ గొప్ప క్రికెటర్‌. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. మ్యాచ్‌ అనంతరం ధోనీ చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం సమర్థించను. యువ ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం ప్రక్రియలో ఒక భాగమని ధోనీ అనడం నూరుశాతం తప్పు. జగదీశన్‌లాంటి యువఆటగాళ్లలో కనిపించని కసి కేదార్‌ జాదవ్‌, పియూష్‌ చావ్లాలో కనిపించిందా..? ఏదేమైనా చెన్నై తాను స్వయంగా చేసిన తప్పిదాలతోనే ఈ సీజన్‌ను లీగ్‌ దశలోనే ముగించబోతోంది’ అని శ్రీకాంత్‌ అన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com