ఏపీ లో కొత్తగా 14 డిగ్రీ కళాశాలలు

- December 10, 2020 , by Maagulf
ఏపీ లో కొత్తగా 14 డిగ్రీ కళాశాలలు

** వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం **

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 14 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు గిరిజన గురుకులాల సొసైటీ ప్రతిపాదనలు రూపొందించింది. గురుకులాల తరహాలోనే కళాశాలలతో పాటు వసతి సదుపాయం ఉండేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 7 బాలికలు, 7 బాలుర కోసం ప్రారంభించనుంది. 

ఒక్కో కళాశాల ఏర్పాటుకు రూ.14 కోట్ల చొప్పున వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. ఇవి పూర్తిగా సొసైటీ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. విశాఖపట్నంలో 2, శ్రీకాకుళం-2, విజయనగరం-2, తూర్పుగోదావరి-2, నెల్లూరు-2, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం, చిత్తూరు జిల్లాల పరిధిలో ఒక్కో కళాశాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. డిగ్రీ కోర్సుల ప్రారంభానికి యూజీసీ, విశ్వవిద్యాలయాల అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ అనుమతులు రావాలంటే నిర్దేశిత ప్రమాణాలు పాటించాల్సి ఉన్నందున ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశముంది. మరో 14 ఇంటర్‌ కళాశాలలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బాలికల కోసం కొత్తగా 8 గురుకుల జూనియర్‌ కళాశాలలు ప్రారంభించేందుకు సొసైటీ సన్నద్ధమవుతోంది. ఒక్కో కళాశాలలో తొలి ఏడాది 160 మంది, రెండో ఏడాది 160 మంది చొప్పున ప్రవేశాలు కల్పించేలా ప్రతిపాదనలు పంపారు. 

శ్రీకాకుళం జిల్లా భామిని, మొలియాపుట్టి, విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాలెం, చింతపల్లి మండలం లోతుగెడ్డ, తూర్పుగోదావరి జిల్లా చింతూరు, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు, గుంటూరు జిల్లా బొల్లాపల్లి, నెల్లూరు జిల్లా ఓజిలిలో కొత్త కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 6 గురుకులాలను అప్‌గ్రేడ్‌ చేసి జూనియర్‌ కళాశాలలుగా మార్చనున్నారు. మల్లి(శ్రీకాకుళం), కొమరాడ(విజయనగరం), మారికవలస(విశాఖపట్నం), రేణిగుంట(చిత్తూరు), రాయచోటి(కడప), తనకల్లు(అనంతపురం)లోని గురుకులాలను ఇంటర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com