కుంభమేళా:మూడున్నర నెలలకు బదులుగా 48 రోజులకు కుదింపు
- December 27, 2020హరిద్వార్:ప్రపంచాన్ని చుట్టేసిన కోవిడ్ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. అటు పండుగలు, ఉత్సవాలను మొక్కుబడిగా జరుపుకునే పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న హరిద్వార్ కుంభమేళాను మూడున్నర నెలలకు బదులుగా 48 రోజుల పాటు కుదిస్తూ ఉత్తారాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మదన్ కౌశిక్ వెల్లడించారు. కుంభమేళాకు సంబంధించిన నోటిఫికేషన్ను జనవరి 1వ తేదీకి బదులు ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే, కుంభమేళాకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్న మంత్రి.. ప్రధాన ఘాట్లలో మార్చి-ఏప్రిల్లో పవిత్ర స్నానాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ ఘాట్లలో 48 రోజుల పాటు భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించవచ్చునని తెలిపారు.
మరోవైపు, కుంభమేళాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి సన్నాహకాలు చేయలేదని అఖిల భారతీయ అఖారా పరిషత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కుంభమేళాకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నిధులను మంజూరు చేశారు. భక్తులకు భద్రత కల్పించడంలో భాగంగా నిఘా వ్యవస్థ కోసం రూ.17.34 కోట్లకు ఆమోదం తెలిపారు. తొలి విడతగా రూ.6.94 కోట్లు విడుదల చేశారు. అలాగే,1,000 పడకలతో తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు వీలుగా సామగ్రి కొనుగోలుకు రూ.15.46 కోట్లు మంజూరు చేశారు. ఏళ్ల తరబడి కుంభమేళాను మూడున్నర నెలల పాటు నిర్వహిస్తున్నప్పటికీ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈసారి నెలన్నర రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు మంత్రి మదన్ కౌశిక్ తెలిపారు.
తాజా వార్తలు
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!