థర్డ్ వేవ్ హెచ్చరిక... చిన్నారుల కోసం మూడు భారీ హాస్పిటల్స్... జగన్ సర్కార్ నిర్ణయం
- June 07, 2021
అమరావతి: ఒకవేళ థర్డ్వేవ్ గనుక వస్తే పిల్లల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది, తీవ్రత ఏ రకంగా ఉంటుందన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పీడియాట్రిక్ సింప్టమ్స్ను గుర్తించడానికి ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు కూడా శిక్షణ ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సీఎం సూచించారు.
థర్డ్వేవ్పై ప్రభుత్వ సన్నద్ధత
కోవిడ్ మూడో వేవ్పై సీఎం జగన్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. మూడో వేవ్పై అనాలసిస్, డేటాను సీఎంకు అధికారులు వివరించారు. థర్డ్వేవ్ వస్తేగనుక పిల్లలకు అందించాల్సిన వైద్యంపై సమావేశంలో చర్చించారు. థర్డ్ వేవ్ వస్తుందా? లేదా? అన్నదానిపై శాస్త్రీయ నిర్ధారణ లేదని అధికారులు సీఎంకు తెలిపారు. అయినా ఒకవేళ వస్తే కనుక తలెత్తే పరిణామాలు, ప్రభావితమయ్యే వారి వివరాలపై అంచనాలను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు.ఈ నేపథ్యంలో పోషకాహార కార్యక్రమం కొనసాగాలని, టీకాల కార్యక్రమం కూడా కొనసాగించాలని అధికారులు సీఎంకు తెలిపారు. వినియోగించాల్సిన మందులు, పరికరాలు, బయోమెడికల్ ఎక్విప్మెంట్, తదితర అంశాలపైకూడా చర్చ సాగింది.
చిన్న పిల్లల కోసం మూడు నూతన ఆస్పత్రులు
చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి రాష్ట్రంలో మూడు కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్నారు. ఒకటి వైజాగ్లో, రెండోది కృష్ణా–గుంటూరు ప్రాంతంలో, మూడోది తిరుపతిలో అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. దాదాపు రూ.180 కోట్ల చొప్పున ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
టీచింగ్ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ వార్డులు
రాష్ట్రంలోని అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయాలన్న సీఎం అధికారులను ఆదేంశించారు. పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించడానికి వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి పీడియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
ఇక పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులను పరిశీలించి... అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించాలని ఆదేశించారు. థర్డ్వేవ్ వస్తుందనే అనుకుని కావాల్సిన మందులను ముందే తెచ్చి పెట్టుకోవాలని సూచించారు. అప్పటికప్పుడు మందులు కావాలంటే దొరకవు... ముందుగానే కావాల్సిన నాణ్యమైన మందులను తెచ్చుకోవడం, డాక్టర్లను గుర్తించడం చేయాలన్నారు. స్పెషలైజ్డ్ డాక్టర్లను రిక్రూట్ చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ప్రస్తుతం సంపూర్ణ పోషణ్ కింద డ్రైరేషన్ సవ్యంగా ఇస్తున్నామా? లేదా?అలాగే గోరుముద్ద కింద కూడా డ్రైరేషన్ సవ్యంగా ఇస్తున్నామా? లేదా? అన్నదానిపై పర్యవేక్షణ చేయాలన్నారు సీఎం. ఇవన్నీ సక్రమంగా చేసుకుని ముందుకు వెళ్తేనే... మనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటామన్నారు.
పిల్లలకు వైద్యం అందించాల్సిన ఆస్పత్రులను ముందుగానే ఎంపానెల్ కోసం గుర్తించాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రులకు కూడా థర్డ్వేవ్పై సమాచారం ఇచ్చి సన్నద్ధం చేయాలన్నారు. ఆస్పత్రుల వారీగా ఏర్పాటు చేయదలచిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లపై కూడా దృష్టిపెట్టాలన్నారు. వీటికి సంబంధించి జరుగుతున్న పనులపై తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని సీఎం అధికారులకు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







