మెడిసిన్‌లో ఇద్దరు అమెరికా సైంటిస్టులకు నోబెల్‌

- October 04, 2021 , by Maagulf
మెడిసిన్‌లో ఇద్దరు అమెరికా సైంటిస్టులకు నోబెల్‌

ఈ ఏడాది నోబెల్ బహుమతుల (Nobel Prize) ప్రకటన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు మెడిసిన్ విభాగంలో అమెరికా సైంటిస్టులు డేవిడ్ జులియస్‌, ఆర్డెమ్ పాటాపౌటియన్‌లు నోబెల్ గెలుచుకున్నారు. విజేతలను నోబెల్ కమిటీ సెక్రటరీ జనరల్ థామస్ పెర్ల్‌మాన్ ప్రకటించారు. ఉష్ణోగ్రత, స్పర్శకు సంబంధించి గ్రాహకాలను కనుగొన్నందుకుగాను వీళ్లను నోబెల్ వరించింది. మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం ఎలా ఉంటున్నామన్నదానితోపాటు మన మనుగడకు ఉష్ణం, చల్లదనం, స్పర్శను గుర్తించే మన సామర్థ్యం కీలకం. మన నిత్య జీవితంలో వీటిని మనం తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి మన నరాల ప్రేరణలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నకు పరిష్కారాన్ని ఈ ఏడాది నోబెల్ బహుమతి గ్రహీతలు చూపించారు అని నోబెల్ జ్యూరీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

జులియస్ శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆప్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ కాగా.. ఆర్డెమ్ కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఇప్పుడీ ఇద్దరికీ నోబెల్ బహుమతితో వచ్చే 11 లక్షల డాలర్లను సమానంగా పంచుతారు. గతేడాది మెడిసిన్‌లో నోబెల్ ముగ్గురిని వరించింది. ఈ ప్రైజ్‌మనీతోపాటు గోల్డ్ మెడల్ కూడా ఇస్తారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రైజ్‌మనీని ఆల్ఫ్రెడ్ నోబెల్ వదిలి వెళ్లిన ఆస్తిలో నుంచే ఇస్తుండటం విశేషం. డైనమైట్‌ను కనిపెట్టిన నోబెల్ పేరు మీదుగానే ప్రతి ఏటా వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు ఈ అత్యున్నత పురస్కారం ఇస్తున్నారు. నోబెల్ 1895లో మరణించారు. రానున్న రోజుల్లో భౌతిక, రసాయన, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో విజేతలను ప్రకటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com