అసమ్మతి నేతలకు సోనియా వార్నింగ్‌

- October 16, 2021 , by Maagulf
అసమ్మతి నేతలకు సోనియా వార్నింగ్‌

న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో 23 మంది అసమ్మతి నేతలపై సోనియా సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి నేనే పూర్తి స్థాయి అధ్యక్షురాలినని.. ఎలాంటి అంశాలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోనియా తెలిపినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.

పార్టీ నియమాలకు వ్యతిరేకంగా పనిచేస్తే సహించేది లేదని సోనియా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మీడియాకు ఎక్కి పార్టీ ప్రతిష్ఠను తగ్గించాలని చూస్తే ఉపేక్షించేది లేదని ఘాటుగా హెచ్చరించారట సోనియా. తానే పూర్తి స్థాయి అధ్యక్షురాలినని సోనియా తెలిపారని సమాచారం. అయితే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. నాటి నుంచి ఆమె పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు.

మరోవైపు వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష మార్పుపై పార్టీ నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీని కొత్త అధ్యక్షుడిగా చేయాలంటూ కాంగ్రెస్‌లోని పలువురు నేతలు కోరుతున్నారు. కానీ, రాహుల్ మాత్రం కీలక పగ్గాలు చేపట్టేందుకు ముందుకు రావటం లేదు. ఈ సమావేశం ద్వారా దీని పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సమావేశంలో కీలకంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ లో కొద్ది కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పైన చర్చించే ఛాన్స్ ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com