ఎమిరేట్స్ టీ20 లీగ్లో జట్లు కొన్న ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్..
- November 19, 2021
ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్కు ఆదరణ పెరుగుతుండటంతో పలు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు తమ సొంతంగా లీగ్స్ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్లకు మంచి ఆదరణ దక్కడమే కాకుండా భారీగా ఆదాయం కూడా సమకూరుతున్నది. క్రికెటర్లు కూడా పలు లీగ్స్లో ఆడుతూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) కూడా ఒ కొత్త లీగ్కు తెరలేపింది. ఐపీఎల్ మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందర్ రామన్ ఒక లీగ్ను రూపొందించారు. దానినే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం నడిపిస్తున్నది. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మంత్రి షేక్ అల్ నయాన్ కూడా ఈ లీగ్కు మద్దతు తెలిపారు. దీంతో వచ్చే ఏడాది జనవరి నుంచి యూఏఈ వేదికగా ఈ లీగ్ను నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. గత రెండు మూడేళ్లుగా టీ20 లీగ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా.. చివరకు ఇప్పటికి ఒక రూపానికి వచ్చింది.
ఈ లీగ్లో పలువురు వ్యాపారులు ఎమిరేట్స్ క్రికెట్ లీగ్లో పెట్టుబడులు పెట్టారు. మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఓనర్స్ అయిన గ్లేజర్స్ ఫ్యామిలీతో పాటు ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ ఓనర్ షారుక్ ఖాన్, ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ కాప్రి గ్లోబల్, ఢిల్లీ క్యాపిటల్ సహ యజమాని గ్రంధి కిరణ్ కుమార్, బిగ్బాష్ లీగ్ క్లబ్ సిడ్నీ సిక్సర్స్ కూడా ఎమిరేట్స్ క్రికెట్ లీగ్లో భాగం కాబోతున్నారు. త్వరలోనే ఈ లీగ్కు సంబంధించిన బ్రాడ్ కాస్టింగ్ హక్కుల టెండర్లను ఈసీబీ పిలువనున్నది. జనవరిలో క్రికెట్ ఆడటానికి యూఏఈలో చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అంతే కాకుండా యూఏఈ టైమ్ జోన్ వల్ల ఇటు ఇండియా.. అటు వెస్ట్రన్ కంట్రీస్కు సరిపోతుంది. యూఏఈ మ్యాచ్ టైమింగ్స్ అన్ని దేశాల ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. అందుకే ఇక్కడ లీగ్ నిర్వహణ చాలా లాభదాయకంగా ఉంటుందని లీగ్ నిర్వాహకులు అంటున్నారు.
ఐపీఎల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పని చేసిన సుందర్ రామన్ ఈ లీగ్ రూపొందించడానికి రెండు మూడేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల యాజమాన్యాన్ని సంప్రదించి లీగ్ గురించి వివరాలు అందించారు. అప్పుడే ఆ జట్లు లీగ్కు మద్దతు తెలిపనట్లు సమాచారం. అయితే ఏ దేశ క్రికెట్ బోర్డుతో సంబంధం లేకుండా లీగ్ నిర్వహించాలని సుందర్ భావించారు. కానీ ఈసీబీ ఈ లీగ్పై ఆసక్తి చూపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ నుంచి బయటకు వచ్చేసింది.
ఈసీబీ ఆధ్వర్యంలో నడిచినా పెట్టుబడులు పెట్టడానికి ముంబై ఇండియన్స్, షారుక్ ఖాన్ ఆసక్తి కనపరచడంతో లీగ్ ముందుకు నడిచింది. ఐపీఎల్లో ఫ్రాంచైజీ కొనడానికి ప్రయత్నించి విఫలమైన గ్లేజర్ ఫ్యామిలీ ఈ లీగ్తో క్రికెట్ లోకి అడుగు పెట్టింది. ఆరు జట్లతో ప్రారంభం కానున్న ఈ లీగ్లో భారతీయ యాజమాన్యాలదే ఆధిపత్యం ఉన్నది. అధిక పెట్టుబడులు ఇండియా నుంచే వెళ్తున్నాయి. దీంతో ఇండియాలోని ప్రేక్షకుల ఆదరణ కూడా లీగ్కు ఉంటుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







