పుతిన్కు షాక్ ఇచ్చిన ఇటలీ
- March 13, 2022
రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఇటలీ షాక్ ఇచ్చింది. ఇటలీ సముద్ర తీరంలో అత్యంత విలాసవంతమైన నౌకను సీజ్ చేసింది. ఇది పుతిన్కు సంబంధించినదే అని అమెరికా అనుమానిస్తోంది. దీని విలువ 7వందల మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే దీని విలువ 5 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. షెహార్జాడే అనే పేరున్న 459 అడుగుల పొడవైన ఈ విలాసవంతమైన నౌక ఓ రష్యా కోటీశ్వరుడి పేరిట ఉంది.
అమెరికా పలువురి పై ఆంక్షలు విధించడంతో ఇటలీ తీరంలో దీన్ని కొన్ని రోజుల క్రితం సీజ్ చేశారు. ఇది ఎవరిదనేదానిపై ఆరా తీస్తున్న సమయంలో పుతిన్ పేరు బయటకు వచ్చింది. అమెరికా నిఘా వర్గాలు కూడా దీని ఓనర్ పుతినే అని చెబుతున్నాయి. పుతిన్ తన పేరిట ఎక్కువ ఆస్తులను ఉంచుకోరని…. తనకు నమ్మకమైన వారి పేరిట ఉంచుతారని అమెరికా చెబుతోంది. ఇది కూడా అలాంటిదే అంటోంది. ఈ సూపర్ యాచ్కు సంబంధించిన మాజీ సిబ్బందిని విచారించినప్పుడు కూడా దీన్ని పుతిన్ తన వ్యక్తిగత అవసరాలకు వాడుతుంటారని తేలింది.
ఎక్కువగా ఆయనే ఉపయోగిస్తారని వారు చెబుతున్నారు. అతి ముఖ్యమైన వారితో పార్టీల వంటివి ఇందులో జరుగుతుంటాయంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అమెరికా సేకరిస్తోంది. యుక్రెయిన్ యుద్ధం సందర్భంగా అమెరికా రష్యా కోటీశ్వరులపై ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే దీన్ని సీజ్ చేసింది.
యుక్రెయిన్పై దాడులు ముమ్మరం చేసిన రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. రష్యా నుంచి సీఫుడ్, వొడ్కా, డైమండ్స్ దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. రష్యా నుంచి పలు రకాల వస్తువుల దిగుమతిపై నిషేధం అమల్లోకి తెస్తూ పలు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, అమెరికా, దాని జీ-7 దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
ఇప్పటి వరకు రష్యాకు ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అన్న హోదాను తొలగించేశాయి. దీంతో రష్యాతో వాటి శాశ్వత వాణిజ్య సంబంధాలు రద్దవుతాయి. దీనివల్ల రష్యా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెరుగుతాయి. దీని కారణంగా రష్యా తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రష్యా పార్లమెంట్ దిగువ సభ డ్యూమాలోని 386 మంది సభ్యులపై ఇంగ్లండ్ ఆంక్షలు విధించింది.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









