అంతర్జాతీయ విమాన రాకపోకలు పునఃప్రారంభం

- March 27, 2022 , by Maagulf
అంతర్జాతీయ విమాన రాకపోకలు పునఃప్రారంభం

దాదాపు రెండేళ్ల అనంతరం భారత్ లో పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమానరాకపోకలకు అనుమతి లభించింది. ఈమేరకు ఆదివారం నుంచి అనుమతులు అమల్లోకి వచ్చాయి.

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలతో పాటు విమానయాన రంగం కూడా కుదేలైంది. విమానయాన సంస్థలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. గత వందేళ్లలో ఎన్నడూ ఎదుర్కొని గడ్డు పరిస్థితులను విమానయాన రంగం ఎదుర్కొంది. దీనికి తోడు విమానరాకపోకలపై పలు దేశాలు ఆంక్షలు విధించడం పరిస్థితులు మరింత దిగజారాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020 మార్చి 20 నుంచి దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ నిలిపివేసింది. అయితే ఇటీవల కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడం..దేశంలో వ్యాక్సిన్ పంపిణీలో పురోగతి సాధించడంతో భారత్ లో విమాన రాకపోకలపై పాక్షికంగా ఆంక్షలు సడలించింది కేంద్రం.

ఈక్రమంలో గత అక్టోబర్ లో దేశీయంగా ప్రయాణాలకు పచ్చజెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం..అంతర్జాతీయ ప్రయాణాలపై మాత్రం పాక్షిక ఆంక్షలు కొనసాగించింది. అయితే ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులు సద్దుమణగుతుండడంతో తాజాగా అంతర్జాతీయ సర్వీసులను భారత ప్రభుత్వం పునరుద్ధరించింది. ఆంక్షల సడలింపులో భాగంగా విమానాల్లో ఎయిర్ హోస్టెస్, కేబిన్ సిబ్బంది ఇకపై పీపీఈ కిట్ ధరించాల్సిన అవసరం లేదు. విమానంలో మూడు సీట్లలో ప్రయాణికులకు అనుమతి ఇవ్వవచ్చు.

కాగా విమాన ప్రయాణాలపై పూర్తిగా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో కొవిడ్‌కు ముందు మాదిరిగా సర్వీసులు నడిపేందుకు విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు సన్నద్ధమయ్యాయి. భారత్ లో అంతర్జాతీయ సర్వీసుల పునరుద్ధరించడంతో విమానయాన రంగానికి ఊతం ఇవ్వనుంది. దీంతో విదేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు భారతీయ విమానయాన సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. విదేశీ విమాన సంస్థలైన ఎమిరేట్స్‌, వర్ణిన్‌ అట్లాంటిక్‌, లాట్‌ పోలిష్‌, శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ సైతం కోవిడ్ మునుపటి మాదిరిగా భారత్ నుంచి విమాన రాకపోకలు కొనసాగించనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com