ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం

- August 03, 2026 , by Maagulf
ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PM Internship Scheme)ను మరింత సమర్థవంతంగా, విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు రూపంలో మాత్రమే అమలవుతోంది. ప్రధాన పథకం ఇంకా ప్రారంభం కాలేదని స్పష్టం చేసింది.

మూడు దశల్లో అమలు

2024 అక్టోబర్ 3న ప్రారంభమైన పైలట్ ప్రాజెక్టులో ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయని, ప్రస్తుతం మూడో దశ కొనసాగుతోందని ప్రభుత్వం వెల్లడించింది. అమలు సమయంలో వచ్చిన అనుభవాల ఆధారంగా 2026 మార్చి 12న మార్గదర్శకాలను సవరించినట్లు తెలిపింది.

సవరించిన మార్గదర్శకాల ముఖ్యాంశాలు

సవరించిన నిబంధనల ప్రకారం పథకంలో పలు కీలక మార్పులు చేశారు.

  • ఇంటర్న్‌షిప్ వ్యవధిని కంపెనీల అవసరాలకు అనుగుణంగా 6 లేదా 9 నెలలుగా నిర్ణయించారు.
  • నెలవారీ స్టైపెండ్‌ను రూ.5,000 నుంచి రూ.9,000కు పెంచారు.
  • అర్హత వయోపరిమితిని 21–24 సంవత్సరాల నుంచి 18–25 సంవత్సరాలకు విస్తరించారు.
  • మాస్టర్స్ పూర్తి చేసిన వారికి, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు.
  • పథకంలో పాల్గొనే కంపెనీలు, సంస్థల సంఖ్యను పెంచారు.
  • నిరంతరంగా ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభించేలా రోలింగ్ ఇంటర్న్‌షిప్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
  • పోర్టల్‌లో జియో-ట్యాగింగ్, ఖాళీల బదిలీ, అదనపు ప్రయోజనాల వివరాలు వంటి కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
  • రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పరిశ్రమల సంఘాల సహకారంతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

భారీ బడ్జెట్ కేటాయింపులు

పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 2024-25లో రూ.2,000 కోట్లు, 2025-26లో రూ.10,831.07 కోట్లు, 2026-27లో రూ.4,788.45 కోట్లు కేటాయించినప్పటికీ, ప్రధాన పథకం ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు మాత్రమే కొనసాగుతోందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో పురోగతి

2026 జూలై 15 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్టు కింద నమోదైన పురోగతిని కూడా కేంద్రం వెల్లడించింది.

రౌండ్-1: 4,973 ఇంటర్న్‌షిప్ అవకాశాలకు 6,164 ఆఫర్లు ఇవ్వగా, 1,970 మంది అంగీకరించి, 411 మంది చేరారు.
రౌండ్-2: 4,715 అవకాశాలకు 11,095 ఆఫర్లు ఇవ్వగా, 2,870 మంది అంగీకరించి, 650 మంది చేరారు.
రౌండ్-3: 6,384 అవకాశాలకు 1,520 ఆఫర్లు ఇవ్వగా, 848 మంది అంగీకరించి, 556 మంది చేరారు. ప్రస్తుతం మూడో దశ కొనసాగుతోంది.

యువతకు పరిశ్రమల్లో ప్రత్యక్ష అనుభవం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లగా, పై వివరాలను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com