దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్‌తో సందీప్ మక్తాల బృందం భేటీ

- August 03, 2026 , by Maagulf
దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్‌తో సందీప్ మక్తాల బృందం భేటీ

దుబాయ్: తెలంగాణలోని వరంగల్‌కు చెందిన డా.ఈ.విష్ణువర్ధన్ రెడ్డి దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు ఐఎఫ్‌ఎస్ అధికారిగా చరిత్ర సృష్టించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన తొలి అధికారిక సమావేశంలో, వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC) ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాల నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని ఆయన ఆహ్వానించి సమావేశమయ్యారు.

సందీప్ కుమార్ మక్తాల నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో దుబాయ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తోట రామ్‌కుమార్, ఎస్.వి.రెడ్డి, వూర కృష్ణతో పాటు పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

సందీప్ కుమార్ మక్తాల, డా.విష్ణువర్ధన్ రెడ్డిలకు చాలా కాలంగా వృత్తిపరమైన అనుబంధం ఉంది. అమెరికా, కెనడా, సింగపూర్ తదితర దేశాల్లో వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కార్యక్రమాలు, వ్యాపార ప్రతినిధి బృందాలు, సాంకేతిక సదస్సులు, పెట్టుబడి ప్రోత్సాహక కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి పనిచేశారు.

సమావేశంలో కృత్రిమ మేధస్సు (AI), సెమీకండక్టర్లు, స్టార్టప్‌లు, డిజిటల్ టెక్నాలజీ, అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార విస్తరణ, ఆవిష్కరణలు వంటి రంగాల్లో భారత్–యూఏఈ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సందీప్ కుమార్ మక్తాల, డా.విష్ణువర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులకు దుబాయ్ వేదికగా మరిన్ని అవకాశాలు సృష్టించేందుకు వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.

సమావేశం అనంతరం భారత్–యూఏఈ మధ్య వ్యాపారం, సాంకేతికత, పెట్టుబడులు, ఆవిష్కరణలు మరియు ప్రపంచ తెలుగు పారిశ్రామికవేత్తల అనుసంధానానికి సంయుక్తంగా కృషి చేయాలని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com