మహిళా సాధికారత, వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించడంపై దృష్టిసారించాలి:ఉపరాష్ట్రపతి
- April 11, 2022
న్యూఢిల్లీ: సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధి అత్యంత కీలకమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.ఇందు కోసం భాగస్వామ్య పక్షాలన్నీ ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు.
సోమవారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ‘లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్’ ఇతివృత్తంతో జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపుగా 70 శాతం జనాభా ఇప్పటికీ గ్రామాల్లోనే నివసిస్తున్నారని స్పష్టమైందన్నారు. ఈ అంచనాల ఆధారంగా చూస్తే.. జాతీయస్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరునేందుకు మారుమూల ప్రాంతాల్లో అంటే పంచాయతీల స్థాయిలో సమగ్రమైన, పరిపూర్ణమైన అభివృద్ధి జరగాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు.

భారతదేశం నుంచి పేదరికాన్ని నిర్మూలించడం మనముందున్న అతిపెద్ద, ముఖ్యమైన సమస్య అన్న ఉపరాష్ట్రపతి, బాలలు, బాలికలకు సమానమైన విద్యనందించడం, అందరికీ స్వచ్ఛమైన తాగునీరు, పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు అందరికీ సమానమైన ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా కీలకం అన్నారు. గ్రామరాజ్యం లేని రామరాజ్యం అసంపూర్ణమన్న మహాత్ముని మాటలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు.
పేదరికం లేని, పరిశుభ్రమైన, విద్య, వైద్యం అందుబాటులో ఉన్న చిన్నారులకు అనుకూల వాతావరణం కలిగిన, సామాజిక భద్రత కలిగిన, సుపరిపాలన కలిగిన గ్రామాలను నిర్మించుకున్నప్పుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటామని ఇందుకోసం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు.
గ్రామీణ సంస్థలకు నిధుల కేటాయింపు పెరిగిందన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే తలసరి గ్రాంట్ 10వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం రూ.100 ఉండగా.. 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం రూ.674కు చేరిందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలు వివిధ పథకాలను, కార్యక్రమాలను విజయవంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నిధుల కేటాయింపు జరగడం కూడా చాలా ముఖ్యమైనదన్నారు.
నిధులు (ఫండ్స్), విధులు (ఫంక్షన్స్), నిర్వాహకులు (ఫంక్షనరీస్) లను సమర్థవంతంగా అందిస్తే సుస్థిరమైన గ్రామస్వరాజ్యం సాధించవచ్చని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. నిధులను నేరుగా పంచాయతీలకు చేర్చడంలో విజయం సాధిస్తే అద్భుతాలు సాధించవచ్చన్నారు.
దీంతోపాటుగా పంచాయతీరాజ్ వ్యవస్థలు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరాన్నీ ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. ఆర్థికంగా ఆత్మనిర్భరత వచ్చినపుడే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. అనుసంధానత (రోడ్లు, ఇంటర్నెట్), విద్య, వైద్యం, మౌలికవసతులు, నీటిపారుదల వ్యవస్థ వంటివి గ్రామాలకు చేర్చేందుకు వందశాతం లక్ష్యంతో ముందుకెళ్లాలని కూడా ఆయన సూచించారు.
గ్రామాల అభివృద్ధి, సుపరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గ్రామసభలకు సరైన ప్రాధాన్యత కల్పించాలన్న ఉపరాష్ట్రపతి, గ్రామాభివృద్ధిలో గ్రామసభల పాత్ర చాలా కీలకమని సూచించారు. కొంతకాలంగా ఈ సభలకు ప్రాధాన్యత తగ్గుతూవస్తోందన్న ఆయన, మళ్లీ గ్రామసభలకు పునర్వైభవం తీసుకురావాలని సూచించారు. తరచుగా గ్రామాల స్థాయిలో జరిగే సమావేశాల ద్వారా సమగ్రాభివృద్ధికి బాటలు పడతాయని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడమే అసలైన దేశభక్తి అని ఉపరాష్ట్రపతి అన్నారు.
పాలనలోని ప్రతి విభాగంలోనూ పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత అవసరం అన్న ఉపరాష్ట్రపతి.. వ్యవస్థను మరింత పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లేందుకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ‘ఈ-గ్రామ్ స్వరాజ్ ఫర్ స్మార్ట్ అండ్ గుడ్ గవర్నెన్స్’ వంటి డిజిటల్ సాంకేతికతకు పెద్దపీట వేయడాన్ని అభినందించారు. ఇప్పటివరకు 2.38 లక్షల గ్రామాలు ‘ఈ-గ్రామ్ స్వరాజ్’ ను వినియోగిస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన, పాలనలో సాంకేతికత వినియోగం మరింతగా పెరగాలని సూచించారు.
వారం రోజులపాటు జరిగే ఈ సదస్సులో కీలకమైన అంశాలపై మేధోమథనం జరగాలని, ఈ అంశాలను స్థానికంగా వీలున్నచోట అమలు చేయడం ద్వారా గ్రామవికాసానికి బాటలు వేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు ఉపరాష్ట్రపతి సూచించారు. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు కేవలం మార్గదర్శనం మాత్రమే చేస్తారని,. స్థానికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను, ప్రాధాన్యతాంశాలను స్థానిక ప్రజాప్రతినిధులే నిర్ణయించుకోవాలని కూడా ఉపరాష్ట్రపతి సూచించారు. మహిళలకు సాధికారత కల్పించడం, విధానపరమైన అంశాల్లో వారిని కూడా భాగస్వాములను చేయడం అత్యంత అవసరమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, జలశక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే, పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ తోపాటు వివిధ రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు. దాదాపు అన్ని గ్రామాల పంచాయతీల నుంచి ఆన్ లైన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







