హైదరాబాద్-ఢాకాల మధ్య ఇండిగో ఎయిర్ లైన్స్ సర్వీసు ప్రారంభం

- April 18, 2022 , by Maagulf
హైదరాబాద్-ఢాకాల మధ్య ఇండిగో ఎయిర్ లైన్స్ సర్వీసు ప్రారంభం

హైదరాబాద్: హైదరాబాద్- ఢాకాల మధ్య ఇండిగో ఎయిర్ లైన్స్ తొలి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ఈరోజు GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (GHIAL) లిమిటెడ్ నుండి ప్రారంభమైంది. ప్రారంభ విమానం 12.:45 గంటలకు హైదరాబాద్ నుండి ఢాకాకు బయలుదేరింది. GHIAL సీనియర్ అధికారులు,  ఇండిగో అధికారులు, ఇతర భాగస్వాముల సమక్షంలో మొదటి విమాన సర్వీసు ప్రారంభమైంది.   

ఇండిగో ఫ్లైట్ 6E 1931 హైదరాబాద్ విమానాశ్రయం నుండి 12:45 గంటలకు ఢాకా బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇండిగో విమానం 6E 1932 ఢాకా నుండి బయలుదేరి, ఉదయం 6:50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. రెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రయాణ సమయం కలిగిన విమానం హైదరాబాద్ - ఢాకాల మధ్య వారానికి రెండుసార్లు-  శని, సోమవారాల్లో నడుస్తుంది.

భారత పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, చికిత్స కోసం భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ మెడికల్ టూరిస్టులలో 54% మంది బంగ్లాదేశ్ నుండే వస్తున్నారు. బంగ్లాదేశ్ నుండి వైద్య పర్యాటకులు ఎక్కువగా వస్తున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్‌లో అత్యుత్తమ వైద్య సదుపాయాలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నది తెలిసిన విషయమే. నగరానికి వచ్చే వైద్య పర్యాటకులను ఆకర్షించడానికి, విమానయాన సంస్థలు ప్రసిద్ధ అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం చేస్తూ కొత్త విమాన సర్వీసుల్ని ప్రారంభిస్తున్నాయి. 

ప్రదీప్ పణికర్, CEO- GHIAL మాట్లాడుతూ, “హైదరాబాద్ చారిత్రక స్మారక చిహ్నాలకు, నోరూరించే రుచికరమైన వంటకాలకు, మంత్రముగ్దులను చేసే షాపింగ్ అనుభవాలకు ప్రసిద్ధి చెందింది. అనేక పర్యాటక ప్రదేశాలతో పాటు, హైదరాబాద్ మెడికల్ టూరిజంకు కూడా ప్రధాన కేంద్రంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఇక్కడికి పర్యాటకులతో పాటు వైద్య పర్యాటకులూ భారీగా వస్తున్నారు. హైదరాబాద్-ఢాకా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసుకు చాలా డిమాండ్ ఉంది. ఈ కొత్త కనెక్టివిటీ బంగ్లా దేశీయులు మన నగరంలోని వైద్య సదుపాయాల కోసం మాత్రమే మాత్రమే కాకుండా, హైదరాబాదీలు కూడా ఢాకాలోని ప్రత్యేక ఆకర్షణలను చూసే అవకాశాన్ని కల్పిస్తుంది.’’ అన్నారు.

కోవిడ్‌కు ముందు 55 దేశీయ, 16 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇప్పుడు 70 దేశీయ గమ్యస్థానాలకు సర్వీసులున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కాలంలో అంతర్జాతీయ ప్రయాణాలు తగ్గినా, హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇప్పుడు లండన్, సింగపూర్, కౌలాలంపూర్, కొలంబో, దుబాయ్, ఖతార్‌ వంటి మునుపటి గమ్యస్థానాలకు సర్వీసులున్నాయి. దేశంలోని మొత్తం పది దేశీయ విమానయాన సంస్థల సర్వీసులున్న ఏకైక విమానాశ్రయం హైదరాబాద్. ‘సమ్మర్-22’ షెడ్యూల్ కోసం, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ 20 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన స్లాట్‌ల కోసం దాఖలు చేసుకున్నాయి. ఇది కోవిడ్ ముందు సమయంతో పోలిస్తే, 103%. హైదరాబాద్ నుండి థాయ్‌లాండ్, హాంకాంగ్‌లకు త్వరలో విమానాలు తిరిగి ప్రారంభమవుతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com