వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా తెలంగాణ అమ్మాయి..

- May 19, 2022 , by Maagulf
వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా తెలంగాణ అమ్మాయి..

ఇస్తాంబుల్‌: తెలంగాణకు చెందిన యువ బాక్సింగ్ సంచలనం నిఖ‌త్ జ‌రీన్ చ‌రిత్ర సృష్టించింది. మ‌హిళ‌ల ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. గురువారం రాత్రి జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో నిఖ‌త్ ఘన విజ‌యం సాధించింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ను చిత్తు చేసిన నిఖ‌త్.. ఉమెన్స్ వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా నిలిచింది.

ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణపతకం గెలిచింది. 52 కిలోల విభాగంలో ఫైనల్‌లో జిట్‌పాంగ్ (థాయ్‌లాండ్‌)పై 5-0 తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది.

బౌట్‌ ఆరంభం నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. రింగ్‌లో దూకుడుగా కదిలిన నిఖత్.. ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ప్రత్యర్థిపై పంచ్ లతో విరుచుకుపడింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఐదో బాక్సర్‌గా రికార్డు సృష్టించింది నిఖత్. అంతకుముందు మేరీ కోమ్‌, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ కేసీ మాత్రమే గోల్డ్‌ మెడల్‌ను సాధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com